మహబూబ్నగర్, ఏప్రిల్20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానం అమలులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2018కి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గతంలోనే రాష్ట్రపతి ఈ నూతన జోనల్ విధానానికి ఆమోద ముద్ర వేసినా కొత్తగా ఏర్పడిన నారాయణపేట, ములుగు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ విడుదల చేశారు. మరోవైపు ఏడో జోన్ అయిన జోగుళాంబ జోన్లో ఉన్న వికారాబాద్ను 6వ జోన్ చార్మినార్లో కలుపుతూ గెజిట్ విడుదల అయ్యింది. దీంతో తెలంగాణలో ఇకపై కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమమైంది దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ సర్కారు నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. కొత్త జోనల్ విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
జోగుళాంబ జోన్ పరిధిలో 5 జిల్లాలు
జోగుళాంబ జోన్ పరిధిలో ఉమ్మ జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూలు జిల్లాలున్నాయి. ఇక మల్టీ జోన్ పరిధిలో యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లున్నాయి. ఉమ్మడి జిల్లా వరకు ప్రత్యేకంగా ఓ జోన్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నాయి. గత విధానాలను కాకుండా నూతన విధానంలో 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించడం వల్ల వెనకబడిన ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానిక అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడింది. కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. వెనకబడిన జిల్లాలకు ఈ జోనల్ విధానం వల్ల విద్యా ఉద్యోగావకాశాల్లో అసమానతలను తొలగిపోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. తొలుత 31 జిల్లాలకు జోనల్ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 33జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా… తాజాగా ఆమోదం లభించింది.
ఇక అన్ని సమస్యలకూ పరిష్కారం..
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఉద్యోగ, విద్యా సంబంధ విషయాల్లో పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. కొత్త జోనల్ విధానం ఆమోదం లేక ఇన్నాళ్లు రెండు జోన్లు, 10 జిల్లాల విధానం ప్రకారమే కొనసాగుతూ వచ్చింది.
50వేల ఉద్యోగాలు
కొత్త జోనల్ విధానం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటించిన 50వేల ఉద్యోగాల నియామకాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కొత్త జోనల్ విధానం వల్ల వెనకబడిన పాలమూరు ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. మరోవైపు జిల్లాలు ఏర్పడినా ఉద్యోగుల కేటాయింపు మాత్రం పూర్తవ్వలేదు. ఇప్పుడు జోనల్ విధానానికి ఆమోద ముద్ర పడటం వల్ల జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్య సిద్ధం కానుంది. కొత్త విధానం ద్వారా ఉద్యోగుల శాశ్వత కేటాయింపులు చేపట్టనున్నారు.కొత్తగా నియమితులైన వారికి జోన్ల కేటాయింపులు సులభం కానున్నాయి. కొత్త జోన్లకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర ఏనాడో పడింది. కాగా వికారాబాద్ను చార్మినార్ జోన్లో కలపాలి, కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణపేట్ జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తేవాలంటూ రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఆమేరకు ఏడో జోన్ జోగుళాంబ కింద ఉన్న వికారాబాద్ జిల్లాను ఆరో జోన్ చార్మినార్లో చేర్చడంతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాను జోగుళాంబ జోన్లో చేరుస్తూ గెజిట్ విడుదల చేసింది.
జోనల్ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం
జోనల్ వ్యవస్థను ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల త్వరలో ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానం ద్వారా జరిగిన నష్టాన్ని కొత్త జోనల్ విధానం ద్వారా రూపుమాపారు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధివిధానాలను రూపొందిస్తే బాగుంటుంది.