ఈసారి అంచనాలకు మించి పంట దిగుబడి
సీఎం కేసీఆర్ పాలనలో సేద్యానికి స్వర్ణయుగం
త్వరలో జోగుళాంబ బ్యారేజ్ నిర్మాణం
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, నమస్తే తెలంగాణ/పెబ్బేరు రూరల్/శ్రీరంగాపురం, జూన్ 20: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందని, సీఎం కేసీఆర్ పాలనలో స్వర్ణయుగమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి, పాతపల్లి, గుమ్మడం, సూగూరు, జనుంపల్లి, రంగాపురం, శాఖాపురంలో రైతువేదికలు, వైకుంఠధామాలను ఆదివారం మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా శ్రీరంగాపురం మండలంలోని కంభాళపూర్లో రైతువేదిక, గ్రంథాలయం, శ్రీరంగాపూర్లో రైతువేదిక, గోదాంలను, వెంకటపూర్లో రైతువేదికను మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పంట దిగుబడి అంచనాకు మించి వచ్చిందన్నారు. రైతులు సలహాలు, సూచనలు పొందడానికి రైతువేదికలు ఉపయోగించుకోవాలన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను పండించాలన్నారు. ముఖ్యంగా ఆయిల్పాం పంటతో అనేక లాభాలున్నాయని, సాగుకు ముందుకు రావాలన్నారు. దేశంలోనే ఎక్కువగా వరి పండించి బియ్యం అందించే పంజాబ్ రాష్ర్టాన్ని తెలంగాణ అధిగమించిందన్నారు. రెండు సీజన్లలో 3కోట్ల టన్నుల ధాన్యం పండించారన్నారు. ధరణితో భూ సమస్యలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో వరి దిగుబడిలో, పత్తిలో నెంబర్వన్గా ఉందన్నారు. ఉచిత విద్యుత్ అందించడంలో మనమే బెస్ట్గా ఉన్నట్లు చెప్పారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజలు మీ చేతకాని నాయకత్వాన్ని అంగీకరించరన్నారు. త్వరలో జోగుళాంబ బ్యారేజీ అందుబాటులోకి రానున్నదని, కేబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన చట్టంలో ఉన్న అంశాలను పరిష్కరించి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు శైలజ, గాయత్రి, జెడ్పీటీసీలు పద్మ, రాజేంద్రప్రసాద్, రైతుబంధు మండలాల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, గౌడ్నాయక్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వనంరాములు, సింగిల్ విండో అధ్యక్షులు కోదండరాంరెడ్డి, జగన్నాథం నాయుడు, మాజీ మార్కెట్ చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, వ్యవసాయశాఖ అధికారి సుధాకర్రెడ్డి, వనపర్తిరూరల్ డెవలప్మెంట్ అధికారి నర్సింహులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.