అప్పక్పల్లి, అడవిరావుల చెర్వు గ్రామాల్లో ఘటన
నారాయణపేట రూరల్/మల్దకల్, మే 19 : పిడుగుపాటుకు వేర్వేరు చోట్లలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి గ్రామానికి చెందిన తాయప్ప అనారోగ్యానికి గురి కావడంతో చిన్న కుమారుడు మహేశ్ (22) ఎద్దులను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన బంధువులు అతడిని జిల్లా దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మల్దకల్ మండలంలోని అడవిరావుల చెర్వు గ్రామానికి చెందిన రైతు భీమన్న (35) తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టు కిందికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడడంతో భీమన్న అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే మృతుడి భార్య, వదిన, నలుగురు కుటుంబ సభ్యులు కూడా షాక్కు గురయ్యారు. క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.