మహబూబ్నగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వైద్య విధాన పరిషత్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఒక జనరల్ దవాఖాన, నాలుగు జిల్లా దవాఖానల్లో వివిధ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని దవాఖానల్లో తగినంత సి బ్బందిని నియమిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,383 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 222 పోస్టులు కేటాయించారు. ఇందులో 65 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో, 157 పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలం వరకు వీరికి అగ్రిమెంట్ ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఐసీయూ హెడ్, జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, ఎక్స్రే అటెండెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, ఫార్మసిస్టు, రేడియోగ్రఫర్, ఆఫీసు అటెండర్లు, స్వీపర్స్, ధోబీలు, సెక్యూరిటీ గార్డులు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. నాగర్కర్నూల్ జిల్లాలో 17 కాంట్రాక్టు పోస్టులు, 43 అవుట్ సోర్సింగ్ పోస్టులు, మహబూబ్నగర్లో 3 కాంట్రాక్టు, 7 అవుట్ సోర్సింగ్, వనపర్తిలో 13 కాంట్రాక్టు, 21 అవుట్ సోర్సింగ్, జోగుళాంబ గద్వాలలో 17 కాంట్రాక్టు, 52 అవుట్ సోర్సింగ్, నారాయణపేటలో 15 కాంట్రాక్టు, 34 అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.