వరిలో వెదజల్లే పద్ధతిని అలవర్చుకోవాలి
ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా సాగు చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
పెద్దమందడి, జూన్14: వ్యవసాయం లేకపోతే లోకమే లేదని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలంలోని చిన్నమందడి గ్రామంలో చేపట్టిన వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కడ కూడా ఒక్క ఇంచు భూమి కూడా ఖాళీగా ఉండకుండా సాగు చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో భూములకు మరింత డిమాండ్ పెరుగుతుందని, బంగారం కంటే అత్యధిక విలువ ఇక్కడి భూములకు రానున్నదన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగును రైతులు సాగుచేస్తున్నారని, వరిలో వెదజల్లే పద్ధతిని అలవర్చుకుంటే ఎకరాకు రూ.10వేలకు పైగా పెట్టుబడి మిగులుతుందన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ యాసంగిలో దాదాపు 30ఎకరాలకు పైబడి వెదజల్లే పద్ధతిలో వరిపంటను సాగుచేశారన్నారు. కూలీలు, కరిగెట చేసే ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ పద్ధతిపై వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట మార్పిడి చేయడంతో మంచి దిగుబడులు పొందవచ్చని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వానకాలంలో పత్తి, కంది పంటలపై, వచ్చే యాసంగిలో వరి తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ఈ యాసంగిలో పండిన పంటలు రాష్ట్రంలోని అన్ని రైసుమిల్లులు 24 గంటలు పనిచేసినా ధాన్యం అయిపోయే వరకు 8నెలల కాలం పడుతుందన్నారు. కావున వచ్చే యాసంగి సీజన్లో వరిపంటలను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, మినుములు, ఆముదాలు తదితర పంటలపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్పామ్ పంటపై రైతులు దృష్టి సారించి సాగుచేసుకోవాలన్నారు. నేటి నుంచి రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమఅవుతుందన్నారు.
రాష్ట్రంలో 63లక్షల పైబడి రైతులకు వానకాలం పెట్టుబడి సాయం అందనుందన్నారు. వనపర్తి జిల్లాలోనే చిన్నమందడి గ్రామ రైతులు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకుంటే రైతులు ఏఏ ఎరువులు వాడాలో తెలుస్తుందన్నారు. గ్రామంలో చాలామంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించారన్నారు. కూరగాయలు అమ్ముకోవడానికి వనపర్తిలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఒక షాపు, పెబ్బేర్లో కూరగాయలు అమ్ముకునేలా మరో షాపును సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి కోరారు. కూరగాయలు తరలించేందుకు ట్రేలు, వాహనాన్ని సమకూర్చాలని అడుగగా స్పందించిన మంత్రి వనపర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఒక షాపును తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కూరగాయలు తరలించేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి ఒక వాహనాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, గొర్రెల కాపరుల జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, సింగిల్విండో డైరెక్టర్ కుమార్యాదవ్, వ్యవసాయాధికారి మల్లయ్య, గ్రామస్తులు సుగ్జీవన్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, బాలరాజు, మన్నెం తదితరులు ఉన్నారు.
మొబైల్ ఐసీయూ క్రిటికల్ కేర్ బస్సు ప్రారంభం
వనపర్తి రూరల్, జూన్14: ప్రభుత్వానికి తోడ్పాటుగా సామాజిక సేవా సంస్థలు ముందుకొచ్చి తమవంతుగా వైద్య సేవలు అందించడం శుభపరిణామం అని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంబీ ఓలివ్ చర్చి ప్రాంగణంలో మొబైల్ ఐసీయూ క్రిటికల్ కేర్ బస్సును మంత్రి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకుగానూ రూ.10వేల కోట్లతో రాష్ట్రంలో వైద్యరంగానికి పటిష్ట ప్రణాళిక రూపొందించారన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకో మొబైల్ ఐసీయూ బస్సును అందించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, క్రిస్టియన్ మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు.