గత ఏడాది రికార్డును తిరగరాసేందుకు
సిద్ధమైన మహబూబ్నగర్ యంత్రాంగం
తయారీలో నిమగ్నమైన మహిళా సంఘాలు
డీఆర్డీఏ నుంచి 1.70 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 30 లక్షల విత్తన బంతులు
హెలీక్యాప్టర్, డ్రోన్ల ద్వారా వెదజల్లేందుకు కసరత్తు
మహబూబ్నగర్, జూన్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత ఏడాది హరితహారంలో భాగంగా 1.18 కోట్ల విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో, కొండకోనల్లో వెదజల్లి నెలకొల్పిన రికార్డును తిరగరాసేందుకు పాలమూరు మళ్లీ సిద్ధమవుతున్నది. ఈ ఏడాది రెండు కోట్ల విత్తన బంతులతో గత ఏడాది నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయనున్నది జిల్లా యంత్రాంగం. సెర్ప్ ఆధ్వర్యంలో 1.70 కోట్లు, మెప్మా ద్వారా 30 లక్షల సీడ్ బాల్స్ సిద్ధం చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈనెల 15 నుంచి 10 రోజుల పాటు విత్తన బంతులు జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఎక్కడికక్కడే తయారు చేయనున్నారు.
అనంతరం ఆ విత్తన బంతులను స్థానికంగానే అడవులు, కొండకోనలు, మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో వెదజల్లనున్నారు. ఇందుకోసం హెలిక్యాప్టర్, డ్రోన్లను వినియోగించేందుకు ఆలోచిస్తున్నారు. మరికొన్నిచోట్ల మనుషులు సైతం విత్తన బంతులను వెదజల్లనున్నారు. హరితహారంలో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ ఎస్. వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు.
పైసా ఖర్చు లేకుండా రెండు కోట్ల యజ్ఞం…
గత ఏడాది 1.18 కోట్ల విత్తన బంతులను తయారు చేసి నెలకొల్పిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును పాలమూరు జిల్లా యంత్రాంగం తిరగరాసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రస్తుతానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. పచ్చదనం పెంపుకోసం మహిళలు ఉచితంగా పనిచేసేందుకు ముందుకు రాగా… అటవీ శాఖ విత్తనాలను సేకరిస్తోంది. విత్తన బంతులు తయారు చేసేందుకు అవసరమైన ఎరువు, మట్టిని గ్రామ పంచాయతీలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో పైసా ఖర్చు లేకుండానే రెండు కోట్ల విత్తన బంతులు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రతువులో మహిళా సంఘాలదే కీలక పాత్ర. కేవలం ఒక్క రూపాయి కూడా కూలీ తీసుకోకుండా జిల్లాలోని లక్ష మంది మహిళలు రెండు కోట్ల విత్తన బంతులు తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. విత్తనాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. సేకరించిన విత్తనాలను ఈ నెల 15 నుంచి 10 రోజుల పాటు విత్తన బంతులు తయారు చేయనున్నారు.
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1.70 కోట్ల విత్తన బంతులు, మహబూబ్ నగర్, జడ్చర్, భూత్పూరు పరిధిలోని మెప్మా ద్వారా 30 లక్షల విత్తన బంతులు తయారు చేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు. పెద్ద గ్రామ పంచాయతీలో 5వేలు, మధ్య తరహా గ్రామ పంచాయతీలో 3వేలు, చిన్న జీపీల్లో 2 వేల విత్తనాలు తయారుచేసేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. విత్తన బంతుల తయారీ వాటిని ఎక్కడెక్కడ వెదజల్లాలో తాసిల్దార్లు స్థల పరిశీలన చేస్తారు. అనంతరం ఎక్కడ తయారు చేసిన విత్తనాలను ఆప్రాంతంలోనే వెదజల్లనున్నారు. ప్రభుత్వ స్థలాలు, కొండకోనలు, అటవీ ప్రాంతాలు, మనుషులు చేరుకునలేని ప్రదేశాల్లో విత్తన బంతులను వెదజల్లనున్నారు. సుమారు 8వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మయూరి పార్కు అటవీ ప్రాంతంలో విత్తన బంతులను చల్లేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విత్తనాల సేకరణ వేగంగా జరుగుతోంది. గ్రామాల్లో మహిళలు సైతం తమ పరిధిలో విత్తనాలను సేకరిస్తున్నారు. ఇక మట్టి, ఎరువు బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించారు. పంచాయతీల్లో ట్రాక్టర్ సౌకర్యం ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి, ఎరువు సేకరించేందుకు అవకాశం ఏర్పడింది.
భాగస్వామి కావడం నా అదృష్టం
గత ఏడాది కోటికి పైగా విత్తన బంతులు తయారు చేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. సర్వైవల్ రేటు సైతం ఎంతో బాగుంది. ఈ ఏడాది ఏకంగా రెండు కోట్ల విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమంలో నేను భాగస్వామ్యం వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పచ్చదనం పెంపొందించడం వల్లే సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అందుకే హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. జిల్లాలో విత్తనబంతుల తయారీ నుంచి వాటిని వెదజల్లే వరకు మహిళా సంఘాల సభ్యులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గత ఏడాది నెలకొల్పిన రికార్డును ఈసారి తిరిగి మనమే అధిగమించనున్నాం.
వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్నగర్
విత్తన బంతులకు ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో రెండు కోట్ల విత్తన బంతులు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరిస్తున్నాం. ఈనెల 14న మహిళా సంఘాలకు విత్తన బంతుల తయారీపై శిక్షణ ఇస్తున్నాం. అనంతరం 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 10 రోజుల పాటు రెండు కోట్ల విత్తన బంతులను జిల్లాలోని 15 మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేయనున్నారు. ఇందుకోసం మహిళలు కనీసం కూలీ కూడా తీసుకోవడం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు పర్యవేక్షణలో 2 కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం విజయవంతం చేస్తాం.
యాదయ్య, డీఆర్డీవో, మహబూబ్నగర్