23 గ్రామాల్లోని నర్సరీల్లో 4 లక్షల 85 వేల మొక్కల పెంపకం
ఊట్కూర్, జూన్ 13 : 7వ విడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన గ్రామ నర్సరీల్లో ప్రజలకు అవసరమైన పలు రకాల మొక్కలను ఇచ్చేందుకు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా మొక్కలను నాటేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
మన ఊరు-మన నర్సరీ
మండలంలోని 23 గ్రామాల్లో 23 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంచారు. అధికారులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన మన ఊరు-మన నర్సరీల్లో 21 వేల చొప్పున మొక్కల పెంపకం చేశారు. మండలంలో దాదాపు 4 లక్షల 85 వేల మొక్కల పెంపకం చేపట్టి హరితహారంలో నాటేందుకు అధికారులు సిద్ధం చేశారు. గ్రామాల్లో హరితహారం నర్సీరీలను ఎంపీడీవో, ఉపాధి ఏపీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, టీఏలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అవసరాలకు అనుగుణమైన మొక్కలే..
గ్రామాల్లో రైతులు, ప్రజలకు అవసరమైన మొక్కలనే నర్సరీల్లో పెంపకం చేశారు. ప్రధానంగా కానుగ, చింత, నిమ్మ, దానిమ్మ, జామ, ఈత, ఖర్జూర, టేకు, చైనా బాదం, అశ్వగంధ, రేన్ ట్రీ, వేప, మందారం, గన్నేరులాంటి మొక్కలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉపాధి కూలీలతో..
గ్రామాల్లో హరితహారం మొక్కలను నాటేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు అనువైన ప్రదేశాలు, పొలం గట్లు, రోడ్ల పక్కన ప్రదేశాలను అధికారులు ఇప్పటి నుంచే గుర్తిస్తున్నారు. వర్షం కురువడమే ఆలస్యంగా మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలతో గుంతలు తీయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి గ్రామానికి 10 వేల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. 5 ఎకరాలలోపు చిన్న, సన్న కారు రైతులు మొక్కలు పెంచేందుకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అధికారుల ప్రత్యేక సమావేశాలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న 7వ విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ఇప్పటికే పలు దఫాలుగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. డీఆర్డీవో పీడీ కాళిందిని, ఎంపీడీవో కాళప్ప, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు.