రూ.10 వేల కోట్లతో మరింత పటిష్టంగా వైద్యరంగం
కొత్త మెడికల్ కళాశాలలతో స్వరూపమే మారబోతోంది
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
బల్మూరులో టీటా, ఏటీఎస్ ఆధ్వర్యంలో కొవిడ్ దవాఖాన ప్రారంభం
మహబూబ్నగర్, జూన్13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమయిందని.. రూ. 10వేల కోట్లతో వైద్యరంగాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా బల్మూరులో ఏర్పాటు చేసిన కొవిడ్ దవాఖానను ఆయన ప్రారంభించారు. నూతన వైద్య కళాశాలలతో తెలంగాణ వైద్యరంగం స్వరూపం మారబోతున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే విద్య, వైద్యం ప్రజా వ్యవస్థలోనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నదన్నారు.
విద్య, వైద్యం కోసం ప్రజలు కార్పోరేట్ వ్యవస్థ మీద ఆధారపడకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమన్నారు. ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్న ఏటీఎస్, టీటాలకు అభినందనలు తెలిపారు. కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని… వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం కొవిడ్ కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హెల్త్ కేర్ లో టెక్నాలజీ ఎలా వినియోగించవచ్చన్నది టీటా నిరూపిస్తుందని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ఉన్నత విద్యావంతులైన టెక్కీలు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఆధ్వర్యంలో పల్లెసీమల్లో సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బల్మూర్ మండల వాసులు కోవిడ్ దవాఖనసేవలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. వివిధ రంగాల్లో స్థిర పడిన వారు తమ స్వంత ఊరి కోసం సాధ్యమైనంత మేరకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా టీ.కన్సల్ట్ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు.
ఎన్నారైలతో జూమ్ మీటింగ్…
బల్మూరు కొవిడ్ దవాఖాన నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నారైలతో జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పాలనపై ఎన్ఆర్ఐలు ప్రశంసలు కురిపించారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయ స్వరూపం మారిపోయిందని మంత్రి వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నేరుగా లాభపడింది రైతాంగమేననని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మా మంగల్ కుంటపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల రోడ్డు అడిగితే నిధులు కేటాయించలేదని… తెలంగాణ ప్రభుత్వంలో అసలు రోడ్లు అడగాల్సిన అవసరం లేకుండానే మా ఊరికి, మా చుట్టుపక్కల ఊర్లకు రోడ్లు వచ్చాయని అమెరికన్ తెలంగాణ సొసైటీ చైర్మన్ కరుణాకర్ జూమ్ సమావేశంలో తెలిపారు.
సొంత ప్రాంతంపై అభిమానంతో…
కొవిడ్ వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ సొంత ప్రాంతాల్లోని వారి ఆరోగ్యంపై దృష్టి సారించడం గొప్ప విషయమని ఎంపీ రాములు అన్నారు. బల్మూరులో కొవిడ్ దవాఖాన ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన టీటాను స్థానిక ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు అభినందించారు. ఈ దవాఖాన వల్ల మారుముల ప్రాంత ప్రజలకు సైతం కొవిడ్ సేవలు అందుబాటులోకు వస్తాయన్నారు. విదేశాలలో ఉన్నా మాతృభూమికి ఎన్నారైలు చేస్తున్న సేవలు మరవలేనివని గువ్వల ప్రశంసించారు. కోవిడ్ దవాఖాన ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాత రంగారావు, మిగతా ఎన్నారైలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారైలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తామన్నారు.
బల్మూరులో రెండో కొవిడ్ దవాఖాన…
నారాయణపేట జిల్లా మాగనూరులో ఏర్పాటు చేసిన మొదటి కోవిడ్ దవాఖన విజయవంతంగా సేవలు అందిస్తోందని, ఇప్పటికే 100కు పైగా ఉచిత కన్సల్టేషన్లు పూర్తయ్యాయని టీటా గ్లోబల్ ప్రెసిడెండ్ సందీప్ మక్తాల తెలిపారు. స్టాప్ థర్డ్ వేవ్ అనే ప్రచారంతో ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున కొవిడ్ దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. బల్మూరులో ఏర్పాటు చేసిన కొవిడ్ దవాఖానలో వీడియో కన్సల్టింగ్ ద్వారా ప్రఖ్యాతి గాంచిన వైద్యులతో వైద్యసాయం అందుతుందన్నారు.
ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బల్మూర్లో కోవిడ్ దవాఖన ఏర్పాటు దాత మాధవరం రంగారావు మాట్లాడుతూ గ్రామస్తులకు ఈ ఆరోగ్య కేంద్రంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్, బల్మూర్ఎంపీపీ అరుణ, గ్రామ సర్పంచ్ శివశంకర్, ఏటీఎస్ ఇండియా అడ్వైజర్బాణాపురం రామచంద్ర రెడ్డి, మాధవరం రాఘవరావు, టీటా తరఫున శ్రావణి బాసరాజు, ఇలియాస్, సౌమ్య , పూజ బండారి, అనీష్ సర్వబోట్ల, జ్ఞానకర్ రెడ్డి, అమెరికన్ తెలంగాణ సంఘం తరఫున చైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ నరేందర్ చీమెర్ల, కోవిడ్ దవాఖన ప్రోగ్రాం అడ్వైజర్ డాక్టర్ దిలీప్ బీరెల్లి, తాజా మాజీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి కందిమల్ల, జనరల్ సెక్రటరీ వెంకట్ మంతెన మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ దవాఖన ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు.