వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఏర్పాటు
వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసుల పాత్ర ఎనలేనిది
వ్యవసాయం, అనుబంధ పనులకు వెళ్లేవారికి పాస్ అవసరం లేదు
ధాన్యం తరలింపు, మిల్లర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్ష
పెబ్బేరు, మే 13: కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాకో టాస్క్ఫోర్స్ పనిచేస్తుందని, ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, దవాఖాన సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో కొనసాగుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా గురువారం పెబ్బేరు పట్టణంలోని ప్రియదర్శిని జారాల అతిథి గృహంలో వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో మంత్రి నిరంజన్రెడ్డితోపాటు నాగర్కర్నూల్ ఎంపీ పీ రాములు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా నియంత్రణలో వైద్యుల పాత్ర ఎనలేనిదన్నారు. కరోనా విపత్కర సరిస్థితుల్లో పారిశుధ్య, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని కొనియాడారు. కరోనా సెకండ్ వెవ్లో వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున టాస్క్ఫోర్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా టాస్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. మనోధైర్యానికి మించిన మందు లేదని.. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నది వైరస్ తీవ్రతతో కాదని.. ఆందోళనతోనే అని పేర్కొన్నారు. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డి స్వయం గా ఈ విషయం వెల్లడించారని గుర్తుచేశారు.
వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్లో ఉంచితే ఇబ్బంది ఉండ దు.. అందుకే ఇంటింటి సర్వేలో జ్వర పీడితులను గుర్తించి మందులు ఇస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాల్లో 1,39,445 మందిని సర్వే చేయగా లక్షణాలున్న 3,274మందికి మందులు పంపిణీ చేశారని, 62మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్ల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 1,36,925మందిని సర్వే చేయగా లక్షణాలున్న 3,241మందికి మందులు పంపిణీ చేశారని, 138మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయ పనులు, అనుబంధ పనులకు వెళ్లే వారికి ఎలాంటి పాసులు అవసరం లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారు మాత్రం తప్పకుండా పాసులు తీసుకోవాలని సూచించారు. ధాన్యం బస్తా బరువు 40కిలోలేనని హమాలీల కొరతను అరికట్టడంతోపాటు గ్రామాల్లో చైతన్యం చేసి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపు, మిల్లర్ల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వనపర్తి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, రఘురామశర్మ, వనపర్తి, గద్వాల జిల్లాల ఎస్పీలు అపూర్వరావు, రంజన్ రతన్కుమార్, ఆయా జిల్లాల వైద్యాధికారులు, దవాఖాన సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.