మహబూబ్నగర్, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా జలాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వెనుకబడిన పాలమూరు జి ల్లాకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పట్ట ణ ప్రగతి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ దాదాపు పూర్తయిందని, త్వ రలో కరివెన నుంచి నారాయణపేటకు కాలువ ఏర్పా టు అవుతుందన్నారు. లక్షా 8వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇందుకుగానూ భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే ఒక పంట కాదు రెండు పంటలు పండించొచ్చని తెలిపారు. ఆగస్టు 10న కాలు వ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కా ర్యక్రమం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే సంస్థలను తప్పుదారి పట్టించి, ఏదో చేసి పనులు జరగకుండా అడ్డుకునే దుర్మార్గపు పార్టీలున్నాయని తెలిపారు.
సాగునీళ్లు రావాలంటే మీరంతా వేలాదిగా తరలివ చ్చి కచ్చితంగా పాలమూరు-రంగారెడ్డి పథకం వేగంగా సాగాలని రైతులు హాజరై తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలన్నారు. నారాయణపేటలో అమలవుతున్న పథకాల్లో ఏదన్న ఒక్క ప థకం పక్కనే ఉన్న కర్ణాటకలో అమలవుతున్నదా అని ఆలోచించాలన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.10వేల పంట పెట్టుబడి కర్ణాటకలో వస్తుందా.. ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షా పదహారు ఇస్తారా.. ప్రసవానికి వస్తే ఆడబిడ్డ పుడితే 13వేలు, మగబిడ్డ పుడితే 12వేలు ఇచ్చే పద్ధతి ఉందా.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తారా.. అని ప్రశ్నించారు. కరోనా సమయంలో దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కూడా ప్రభుత్వం రైతుల నుంచి పుట్లుపుట్లుగా పండిన వరిధాన్యాన్ని సంక్షోభ సమయంలోనూ రైతులందరి వద్ద కొనుగోలు చేశామనన్నారు. ఏ విషయంలోనూ పోల్చలేని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఏ ఒక్క పథకం కూడా మనతో సమానంగా అమలు చేయలేని వారు తమపై లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. చేనేత కార్మికుల కోసం ఇప్పటికే నేతన్నకు చేయూత, చేనేత మిత్ర వంటి కార్యక్రమాలతో పాటు స్థానిక నేత కార్మికులకు అండగా ఉండాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోరిక మేరకు రూ.10 కోట్లతో సిరిసిల్ల తరహాలో చేనేత పార్కును ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు రైతుబంధులాగే చేనేత, మరమగ్గాల కార్మికులకు సైతం రూ.5లక్షల జీవిత బీమా అందించే చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. నారాయణపేట నేతన్నలకు సైతం ఇది ధీమానిస్తుందన్నారు. గతంలో తాగునీటి కోసం 14 రోజులు ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత నిత్యం శుద్ధజలం అందిస్తున్నామన్నారు. మనం పనిచేస్తుంటే ఇప్పుడు ప్రతిపక్షాలు వెటకారంగా మాట్లాడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.29 కోట్లతో మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయన్నారు. పట్టణంలోని ఇంకా మిగిలి ఉన్న 4వేల ఇండ్లకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. రాబోయే ఆరు నెలల్లో పట్టణంలో పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. వలస ప్రాంతమైన నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అడిగారని.. తప్పకుండా మంజూరు చేస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ధాన్యం పండుతోందని ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణే నెంబర్ వన్ అని కేటీఆర్ అన్నారు. ధాన్యంతో పాటు కందులు, పత్తి, ఆయిల్పాం బాగా పండుతున్నాయన్నారు. ఈ వ్యవసాయ దిగుబడులతో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ తమకు ఆదేశాలిచ్చారన్నారు. టీఎస్పీజెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో ఒకటి నారాయణపేట జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. 250 ఎకరాలకు తగ్గకుండా స్థలం కేటాయిస్తూ ప్రతిపాదన పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. నారాయణపేటలో త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. జిల్లా ఇచ్చిన కేసీఆర్ బిల్డింగులు ఇవ్వకుండా ఆపుతారా అని ప్రశ్నించారు.
పది రోజుల్లో 2100 స్తంభాలు, 19 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చే యడం మామూలు విషయం కాదన్నారు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తేవడమే కాకుండా వాటిని కఠినంగా అమ లు చేస్తున్నామన్నారు. గ్రామపంచాయతీలకు నెలకు రూ.338 కోట్లు, పట్టణాలకు రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 141 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఏపార్టీకి చెందిన పాలకవర్గం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పట్టణాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. కరోనాలో ఆక్సిజన్ లేక అనేక మంది పడిన ఇబ్బందులు గుర్తించాలని.. మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మేలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతిని జోడెద్దుల బండిలాగా నడిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
పేటలో ముమ్మరంగా అభివృద్ధి పనులు..
పట్టణ ప్రగతిలో భాగంగా 10వ రోజైన శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో 10 పడకల చిన్న పిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. రూ.6 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత మా ర్కెట్, రూ.20 లక్షలతో అమరవీరుల స్తూపం ఏర్పాటుకు శంకుస్థాపన, అంబేద్కర్ కూడలి నుంచి వీర సావర్కర్ కూడలి వరకు పాదచారులకు రోడ్డుతో పాటు రహదారి సుందరీకరణకు రూ. 15.95 కోట్లతో శంకుస్థాపన చేశారు. చేనేత వస్ర్తాలకు అపురూప నిలయమైన నారాయణపేట చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి అన్ని విధాలా ఆదుకోవడానికి సింగారం చౌరస్తా వద్ద 2.3 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న చేనేత నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి, విక్రయ కేంద్రానికి రూ.10 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా రూ.80 లక్షల వ్యయం తో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పార్క్, రూ.1.45 కోట్ల వ్యయం తో ఏర్పాటు చేసిన సైన్స్ పార్కును ప్రారంభించారు. చిల్డ్రన్ పా ర్కు, సైన్స్ పార్కును పరిశీలించిన మంత్రి కేటీఆర్.. మహానగరంలో ఉన్నంత అందంగా పార్కులను తీర్చిదిద్దినందుకు కలెక్టర్, ఎమ్మెల్యేను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మండలి విప్ కె.దామోదర్రెడ్డి, విప్ గువ్వల బాలరా జు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, నరేందర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు దేవరి మల్లప్ప, బాద్మి శివకుమార్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్పర్సన్లు వనజ, స్వర్ణ సుధాకర్రెడ్డి, చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ దాసరి హరిచందన, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ, టీఆర్ఎస్ నేతలు విఠల్రావు ఆర్య, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలోనూ రైతులకు అండగా..
కరోనా వచ్చి రాష్ట్రం ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రైతులకు రైతుబంధు సాయం కింద రూ.7,360 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. 15 నెలల్లో రాష్ర్టానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గినా అన్ని రంగాల్లోనూ లోటు లేకుండా నిధుల విడుదల జరిగేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు విడుదల అవుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు నారాయణపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగాయి. కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి చిరునామాగా మారాయి. గ్రామాల్లో మురికి కూపాలు, పెంటకుప్పలు లేని సమాజం సాధ్యమవుతున్నది. భవిష్యత్తులో పల్లెలు, పట్టణాలకు వ్యత్యాసం ఉండని విధంగా అభివృద్ధి జరుగుతుంది. హరితహారం, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలతో రాష్ర్టానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పట్టణాలు అభివృద్ధి బాట పట్టాయి. – వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
‘పాలమూరు’ పూర్తి చేసి తీరుతాం..
ఏపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి తీరుతాం. వెనుకబడిన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు కనీసం తాగునీళ్లు కూడా దొరకని దుస్థితి ఉండేది. బంగారం, చేనేతకు ఎంతో ప్రసిద్ధి చెందిన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే తొలి మున్సిపాలిటీ అయిన నారాయణపేటలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కనీసం తాగునీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మనం ముందున్నాం. అయితే అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడబోం. మా విశ్వరూపం చూపిస్తే తట్టుకోలేరు. అయితే మా ధ్యాసంతా అభివృద్ధిపైనే ఉంది. మన నాయకుడిని విమర్శిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. నారాయణపేట ప్రజాభీష్టం మేరకు జిల్లా ఇచ్చిన తర్వాత స్వాగతించాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే మన ప్రత్యేకత తెలుస్తుంది. గతంలో సాగునీరు లేక వలసలు పోయిన వారంతా ఇప్పుడు సొంత ఊళ్లకు వచ్చి హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
సమైక్య పాలనలో కనిపిస్తే కబ్జా చేసిండ్రు..
సమైక్య పాలనలో నారాయణపేట పట్టణంలో ఖాళీ జాగా క నిపిస్తే కబ్జా చేసిండ్రు. పార్కుల కోసం వదిలిన స్థలాలు కూడా ఆక్రమించారు. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల కోసం సేకరించిన 23 ఎకరాల స్థలంలోనూ గతంలోనే ఐదెకరాలు క బ్జా చేసి ప్లాట్లు చేశారు. ఆ స్థలం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని తీరుతాం. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేయాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి. పేటలో సాంకేతిక విద్యా సంస్థలు, వ్యవసాయ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాలి. కరివెన మెయిన్ కెనాల్ ద్వారా పేటలో లక్ష, మక్తల్లో 75 వేలు, కొడంగల్ నియోజకవర్గంలో 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలమూరు ప్రాజెక్టును ఎలా డి జైన్ చేస్తే పేటకు నీళ్లు వస్తాయో సీఎం కేసీఆర్కు తెలుసు. రూ.40 కోట్లతో కోయిలకొండ- నారాయణపేట రోడ్డును డబు ల్ రహదారిగా మారుస్తాం. పట్టణంలో రూ.28 కోట్లు పరిహారం గా ఇచ్చి రోడ్డు విస్తరణ చేస్తుంటే.. కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. బంగారం వ్యాపారం మీద 2 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అందుకే ఈ వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకంగా నాలుగెకరాల్లో గోల్డ్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం. వీటిని మంత్రి కేటీఆర్ మంజూరు చేయాలి. అత్యల్ప కరోనా కేసులు ఉన్న జిల్లాగా నారాయణపేట నిలిచింది. సెకండ్ వేవ్లో ప్రభుత్వ దవాఖానలోనే 468 మందికి చికిత్స తీసుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో కేవలం 30 ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు నెలకు 200 పైచిలుకు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో బంగారు నారాయణపేటగా మారుస్తాం.
– ఎస్. రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యే నారాయణపేట