నిండుకుండలా జూరాల ప్రాజెక్టు
నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లుతెరువడంతో వస్తున్న ఇన్ఫ్లో
నాలుగు రోజులుగా వరద ఉధృతి
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటి విడుదల
మహబూబ్నగర్ జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఎప్పుడూ లేనట్లుగా జూరాల ప్రాజెక్టుకు ఈసారి ముందస్తుగా వరదలు వచ్చాయి. నారాయణపూర్ ప్రాజెక్టు వద్ద మరమ్మతులు చేపట్టడంతో అక్కడి అధికారులు దిగువనకు నీటిని వదలుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు నీటిని వదులుతామని జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. నారాయణపూర్ నుంచి 12వేల క్యూసెక్కులు వదులుతుండగా, కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంతో మరో 12వేల క్యూసెక్కులు జూరాలకు కలిసి వచ్చింది. మొత్తంగా ఈ నెల 8వ తేదీన 8వేలకు పైగా ఇన్ ఫ్లో ప్రారంభం కాగా.. వరుసగా రెండు రోజుల పాటు సుమారు 24వేల క్యూసెక్కుల మేర వరద వచ్చింది. పైనుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. వరదను అంచనా వేసిన అధికారుల సూచన మేరకు ప్రజా ప్రతినిధులు బుధవారం జూరాల నుంచి ప్రాజెక్టులకు నీటి విడుదల చేశారు.
నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులతోపాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు సైతం సాగునీరు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు చరిత్రలో జూన్ 9వ తేదీలోపు నీటి విడుదల చేయడం అరుదైన విషయమని అధికారులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం నాటికి జూరాల ప్రాజెక్టుకు 16,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. గురువారం సాయంత్రం నాటికి 9.500 టీంసీఎలకు చేరుకున్నది. నెట్టెంపాడుకు 1500, భీమా మొదటి లిఫ్ట్ నుంచి 650, భీమా రెండో లిఫ్టు నుంచి 750, కోయిల్సాగర్ 630, జూరాల ఎడమ కాల్వకు 600, కుడి కాల్వకు 300, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ 14,435 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 19,056 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నది. నారాయణపూర్ నుంచి నాలుగు రోజులపాటు నీటిని వదులుతామని అక్కడి అధికారులు తమకు సమాచారం అందించారని జూరాల ఏఈఈ బీచుపల్లి తెలిపారు. వారు చెప్పిన మేరకు నీటి విడుదల ఈ నెల 9వ తేదీనే ముగిసింది. అయినా ఇంకా జూరాలకు వరద వస్తూనే ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుతో పాటు భీమా నుంచి సైతం జూరాలకు ఓ మోస్తరు వరద వస్తోందని అధికారులు వెల్లడించారు. ముందస్తుగా వరద రావడం వల్ల జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నింపి ఉంచుకునేందుకు అవకాశం ఏర్పడిందని ప్రజాప్రతినిధులు అంటున్నారు. రైతులకు ఇది సానుకూల అంశమన్నారు.
ముందస్తుగా.. నిండడం రికార్డు
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మొదట జూరాల నిండాలి. ఆ తర్వాత శ్రీశైలం, సాగర్ నిండాలి. అప్పు డు ఆంద్రోళ్ల పొలాలకు నీళ్లు పోవాలి. ఇప్పుడు జూరాలకు వస్తే వచ్చిన నీటిని వచ్చినట్లు పాలమూరు భూ ములకు మళ్లించడం సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా ప్రస్తుతం అంతా బాగుంది. గతంలో ఏనాడు లేనట్లుగా జూన్ 9వ తేదీ నాడే నీటిని ప్రాజెక్టులకు వదలడం రికార్డు. మన నీళ్లు మనమే వాడుకునాలనే ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరినందుకు సంతోషంగా ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
సద్వినియోగం చేసుకోవాలి
ఏనాడు లేనట్లుగా జూన్ 9వ తేదీ నాడే నీటిని ప్రాజెక్టులకు వదలడం ఊహించని విషయం. బుధవారం భీమా ఫేజ్-1, గురువారం భీమా ఫేజ్- 2 నుంచి చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటి విడుదల చేశాం. గతంలో ఇంత త్వరగా నీటిని విడుదల చేసిన రోజులు లేవు. జూరాల నుంచి భీమా, కోయిల్సాగర్కు నీటి విడుదల కొనసాగుతున్నది. రైతులు వరదను సద్వినియోగం చేసుకోవాలి. ఇంజినీరింగ్ అధికారులు త్వరగా రిజర్వాయర్లు నింపి ఉంచాలి.
చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, మక్తల్
స్వరాష్ట్రంతోనే వాడుకుంటున్నాం
స్వరాష్ట్రం సాధించడం వల్లే మన నీటిని మనం ముందస్తుగా వాడుకునే అవకాశం దక్కింది. రైతులు ముందుస్తగా వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. యాసంగిలో రిజర్వాయర్లు, కాల్వల ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు నింపడమే కాకుండా ప్రతి ఎకరాకు సాగునీరందించాం. ఈ సీజన్ లో కూడా రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం.
బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల