గతేడాది 65.. ఈ ఏడాది ఇప్పటికే 45టన్నులు
మరో 25టన్నులు ఎగుమతి
లాక్డౌన్ ఉన్నా.. ఎగుమతులు
ఉద్యాన రైతులను ప్రోత్సహించాలి
అన్ష్ ఆగ్రోనమి ప్రైవేట్ లిమిటెడ్ను అభినందించిన కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి మహబూబ్ నగర్): లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు కుదేలవుతున్నా మహబూబ్నగర్ నుంచి ఐదు దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి అవుతున్నాయని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బాలానగర్ మండలం చిన్నరేవల్లి వద్ద ఏర్పాటు చేసిన అన్ష్ ఆగ్రోనమి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జిల్లాకు చెందిన గుంటి ఆనంద్సాగర్ నిర్వహిస్తున్న యూనిట్ను ఆయన సందర్శించారు. కొల్లాపూర్ బేనిషాన్ మామిడి పండ్లను యూకే, ఫ్రాన్స్, జర్మనీ, హాలెండ్, ఐర్లాండ్కు ఎగుమతి చేస్తున్న ఆనంద్సాగర్ను అభినందించారు. రైతుల నుంచి మేలు రకం పండ్లను సేకరించి వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత ఎగుమతి చేస్తూ రైతులకు లాభాలను అందిస్తున్నారని కలెక్టర్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని ఉద్యాన రైతులను ఎగుమతుల దిశగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బాలానగర్, రాజాపూర్, నవాబుపేట్, మిడ్జిల్, జడ్చర్ల, హన్వాడ మండలాల్లో రైతులు ఎక్కువగా పండ్లు, కూరగాయలు పండిస్తున్నారని, నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసే ఉత్పత్తులను పండిస్తున్నారని తెలిపారు. నాబార్డు ద్వారా ఇక్కడి పండ్లను, కూరగాయలను విదేశాలకుఎగుమతులు చేసేవిధంగా ఏవిధంగా అనుసంధానం చేయాలో అధ్యయనం చేయాలని నాబార్డు ఏజీఎంను కోరినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఉద్యానశాఖ డైరెక్టర్ రెండుసార్లు వచ్చి పరిశీలించారన్నారు. గతేడాది 250 టన్నులు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు వేసుకోగా లాక్డౌన్ కారణంగా 65 టన్నులు పంపించేందుకు వీలయిందని ఉద్యానవన శాఖ డీడీ సాయిబాబా తెలిపారు. ఈ ఏడాది 250 టన్నులు పంపించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నా ఇప్పటివరకు 45 టన్నులు ఎగుమతి చేసినట్లు వివరించారు. ఈ సీజన్లో ప్రస్తుతం మరో 25టన్నులకు పైగా ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. గతంలో మహారాష్ట్ర, ఉత్తర భారతదేశం నుంచి అల్ఫాన్సో, కేసరి రకం మామిడి పండ్లు ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం మన బేనిషాన్ రకానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. కలెక్టర్ వెంట నాబార్డ్ ఏజీఎం శ్రీనివాస్, డీడీఎం నాగార్జున, అధికారులు, బాలానగర్ తాసిల్దార్ రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.