ఎగువ జూరాలలో ఒక యూనిట్
మరిన్ని యూనిట్లు ప్రారంభించే అవకాశం
పర్యవేక్షిస్తున్న డైరెక్టర్ వెంకటరాజం
ధరూరు, జూన్ 9: ప్రియదర్శిని జూరాల జలాశయానికి జలకళ సంతరించకున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరద నీటితో జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్ట్కు 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 7,138 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉన్నది. విద్యుదుత్పత్తికి 5,233, భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, కోయిల్సాగర్ ఎత్తిపోతలకు 315, ఎడమ కాల్వకు 600, కుడికాల్వకు 60, సమాంతర కాల్వ ద్వారా 100 క్యూసెక్కుల నీరు, నీటి ఆవిరి ద్వారా 180 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.070 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 9.657టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
జలవిద్యుదుత్పత్తి ప్రారంభం
ఆత్మకూరు, జూన్ 9 : ఎగువ నుంచి జూరాలకు కృష్ణాజలాలు వచ్చి చేరుతుండడంతో ఎగువ, దిగువ జూరాలలో జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జూరాల ప్రాజక్ట్లో బుధవారం తెల్లవారుజామునుంచే వరద వచ్చి చేరుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పీజేపీ, జెన్కో అధికారులు అప్రమత్తమయ్యా రు. ప్రవాహం పెరుగుతున్న కొద్దీ తగినస్థాయిలో వినియోగానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం ఎగువ జూరాలలో ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. జెన్కో డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో అధికారులు యూనిట్ను విజయవంతంగా రన్ చేశారు.
రాత్రి 10 గంటల వరకు వరద ప్రవాహం స్థిరం గా ఉండగా, ఒకే యూనిట్లో విద్యుదుత్పత్తి కొనసాగింది. తెల్లవారుజామువరకు వరద ప్రవాహం పెరిగితే ఎగువలో మరిన్ని యూనిట్లలో, అదేవిధంగా దిగువ జూరాలలోనూ విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. అంతకుముందు పవర్హౌస్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రా రంభించారు. కార్యక్రమంలో ఎస్ఈలు జయరాం, వ ర్మ, డీఈలు విన్నూత్, ప్రభాకర్, వేణుగోపాల్, పవన్కుమార్, కృష్ణ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
టీబీ డ్యాంకు 3,115 క్యూసెక్కుల ఇన్ఫ్లో
అయిజ, జూన్ 9 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం కు వరద పెరుగుతున్నది. తుంగభద్ర డ్యాం ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంటే, వరనాడు తదితర ప్రాం తాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలో కి ఇన్ఫ్లో చేరుతున్నది. బుధవారం డ్యాంకు ఇన్ఫ్లో 3,115 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, అవుట్ఫ్లో 173 క్యూసెక్కులు నమోదైంది. టీబీడ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1590.04 అడుగుల నీటినిల్వ ఉం ది. 100.855 టీఎంసీల నీటి మట్టానికిగానూ ప్రస్తుతం 9.868 టీఎంసీలు నమోదైనట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
శ్రీశైలం డ్యాం నిర్వహణకు రూ.79లక్షలు
శ్రీశైలం, జూన్ 9 : శ్రీశైలం డ్యాం నిర్వహణకు ఏపీ ప్రభుత్వం మొదటి విడుతగా రూ.79లక్షలు కేటాయించినట్లు తెలిసింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విడతలవారీగా మరమ్మతు పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. డ్యాం అంతర్భాగంలో 800 అడుగుల కింది వరకు ఉండే గ్యాలరీలోని వాటర్ డిశ్చార్జి మెటర్లు, స్టాటర్లు, కేబుల్స్, పైపులైన్ పునరుద్ధరణ కోసం రూ.40లక్షలు మంజూరయ్యాయని, కేబుల్వే ఎగ్జెస్టింగ్ ఫ్యానల్ బోర్డ్ పునరుద్ధరణకు రూ.39లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.