మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
భూత్పూర్ రిజర్వాయర్కు నీటి విడుదల
మక్తల్ రూరల్, జూన్ 9 : వానకాలం పంటలకు ముందస్తుగా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని చిన్నగోప్లాపూర్లో భీమా ఫేజ్-1 పంప్హౌస్లో మోటర్ను స్విచ్ ఆన్ చేసి భూ త్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణాజలాలకు పూజలు చేశారు. అనంతరం చీఫ్ ఇంజినీరు రమేశ్, సూపరింటెండెంట్ ఇంజినీరు శివ ధర్మతేజతో ఎమ్మెల్యే సమావేశమై రిజర్వాయర్ల సామర్థ్యంపై చర్చించారు. జూరాలకు వరద వస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశామని తెలిపారు. దీంతో వానకాలం పంటలు వేసుకోవడానికి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మక్తల్ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సాగునీటి విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. ప్రస్తుత వానకాలంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నర్వ మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.