పొలాలు సిద్ధం చేస్తున్న రైతన్నలు
3,91,223 ఎకరాల్లో సాగు అంచనా
సింహభాగం పత్తి వైపే మొగ్గు..
ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖాధికారులు
గతేడాదికంటే ఈసారి అధికంగా సాగు
గద్వాల, మే 9 : వానకాలం సాగు చేసేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్పడంతో.. గతేడాది కంటే ఈ సారి 10 శాతం మేర సాగు పెరుగుతుందని అధికారుల అంచనా. జోగుళాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీరందడంతో సాగు పెరిగేందుకు అవకాశం ఏర్పడనున్నది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
సాగు అంచనా ఇలా..
ఈ వానకాలంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో సింహభాగం ఈ ప్రాంత ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, పత్తి, అనుములు తదితర పంటలు సాగు చేయనున్నారు. గత వానకాలం సీజన్లో జిల్లాలో 3,65,666 ఎకరాల్లో వివిధ పంటలు, 44,225 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేశారు. ఈ ఏడాది అధికారుల అంచనాలో సాగు పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది సుమారు 3,91,223 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. వీటితో పాటు ఉద్యానవన పంటలు సుమారు 45 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో వరి పంటను 55,000 ఎకరాలు, కందులు 47,000, వేరుశనగ 17,000, ఆముదం 4,500, పత్తి 2,50,000, మొక్కజొన్న 3,423, చెరుకు వెయ్యి, ఇతర పంటలు 13,300 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారుల అంచనా. సుమారు 68,290 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో డీఏపీ-9,230, యూరియా-25,090, పొటాష్-4,450, పాస్పరస్-2,625, కాంప్లెక్సు ఎరువులు 36,563, అమ్మోనియా సల్ఫేట్-1,313, 16-20.0-13 (5,484), 20.20.0.13 (5,484), 28.28.0 (5,484), 10.26.26 (1,828), 12.32.16 (1,828), 14.35.14 (5,484) మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి ప్రభుత్వం గరిష్ఠంగా మద్దతు ధర ఇస్తుండడంతో పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది వానకాలంలో జిల్లాలో 2,21,127 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అయితే, ఈ ఏడాది నీటి వనరులు, మద్దతు ధర అంచనా వేసుకొని ఈ ఏడాది సుమారు 2.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సిద్ధంగా ఎరువులు..
ప్రస్తుతం వానకాలం సీజన్కు సంబంధించి మొదటి విడుతగా ఎరువులు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా 10 వేలు, డీఏపీ 2 వేలు, కాంప్లెక్సు ఎరువులు 15,500, 300 మెట్రిక్ టన్నుల పొటాష్ అందుబాటులో ఉంచారు. రైతులకు ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది.