కర్ణాకటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్
ఏపీలో కొనసాగుతున్న పాక్షిక లాక్డౌన్
సరిహద్దు గ్రామాల వరకే ఆర్టీసీ రాకపోకలు
అత్యవసరం, సరకు రవాణా వాహనాలకే అనుమతి
బార్డర్లలో చెక్పోస్టుల ఏర్పాటు
నూతన కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నది.. సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, ఏపీలో వేల సంఖ్యలో కే సులు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో కరోనా కట్టడికి కర్ణాటకలో రేపటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకానున్నది.. ఏపీలో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న ది.. దీంతో ఉమ్మడి జిల్లాతో సంబంధాలు ఉన్న కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.. ఆర్టీసీ బస్సులను సరిహద్దుల వరకే నడుపుతున్నారు.. బార్డర్ చెక్పోస్టుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.. అత్యవసరం, సరుకు రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.. సరిహద్దు రాష్ర్టాల్లోని లాక్డౌన్ ప్రభావంతో తెలంగాణలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
మహబూబ్నగర్, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ మహమ్మారి కట్టడికి అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో రోజుకూ సుమారు 50వేల వరకు, ఆంధ్రపదేశ్లో సుమారు 20వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న కర్ణాటకలో రేపటి నుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలో గత నెల 27వ తేదీ నుంచి పాక్షిక లాక్డౌన్ విధించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాక్షికంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో సంబంధాలు ఉన్న కర్ణాటకలోని రాయిచూరు, యాద్గిర్.. ఏపీలోని కర్నూలు జిల్లాకు ప్రధాన రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు రాత్రి కర్ఫ్యూతోపాటు.. మధ్యాహ్నం నుంచి పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ నుంచి రాయిచూర్ మీదుగా కర్ణాటకలోని వివిధ జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను తెలంగాణ సరిహద్దు అయిన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టైరోడ్ వరకు నడుపుతున్నారు. యాద్గిర్, గుల్బర్గా జిల్లాల నుంచి నారాయణపేట వైపు కర్ణాటక బస్సులు రావడం లేదు. నారాయణపేట జిల్లా నుంచి కూడా కర్ణాటకకు బస్సులను ఆపేశారు. ఇక బుధవారం నుంచి కర్నూలు మీదుగా రాయలసీమకు తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఆలంపూర్ టోల్ ప్లాజా వరకే నడుపుతున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటకకు ప్రజా రవాణా వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. ఏపీ, కర్ణాటకలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడి లాక్డౌన్ ప్రభావం వల్ల మన ప్రాంతంలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
శ్రీశైలం బస్సులు లింగాల గట్టు వరకు..
హైదరాబాద్తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 75ఆర్టీసీ బస్సులు నిత్యం శ్రీశైలం వెళ్తుంటాయి. ఏపీలో పాక్షిక లాక్ డౌన్ విధించిన తర్వాత శ్రీశైలం బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ప్రస్తుతం పికెట్ డిపో నుంచి 4, సంగారెడ్డి, మహబూబ్నగర్, అచ్చంపేట నుంచి ఒక్కో బస్సు చొప్పున తెలంగాణ చివరి పాయింట్ అమ్రాబాద్ మండలం లింగాల గట్టు వరకు వెళ్లి తిరిగి వస్తున్నాయి. కృష్ణా నదిపై బ్రిడ్జి దాటిన తర్వాత లింగాల గట్టులో ఏపీ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఆపేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం దేవస్థానం తెరిచి ఉంచినా నిత్యం రెండు వందల మందికి మించి భక్తులు రావడం లేదని ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో తక్కువలో తక్కువ 10వేలకు మించకుండా భక్తులు వచ్చేవారిని ప్రస్తుతం కొవిడ్ ప్రభావంతో భక్తుల రాక గణనీయంగా తగ్గిపోయిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
రేపటి నుంచి కర్ణాటకలో..
కర్ణాటకలో ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుండగా.. రేపటినుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించారు. కేసులు భారీగా పెరుగుతుండడంతో గత్యంతరం లేక ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ మీదుగా నిత్యం వందలాది కర్ణాటక తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు రాయిచూర్, యాద్గిర్ మీదుగా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిమంది ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటారు. కర్ణాటక కరోనా కేసులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వేళ గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 12 వరకు పాక్షిక లాక్డౌన్ విధించింది. మధ్యాహ్నం 12గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు రాయిచూరు సరిహద్దుల్లో ఉన్న నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టైరోడ్డు వరకు బస్సులను నడుపుతోంది. రేపటి నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్తో దాదాపుగా ప్రైవేట్ వాహనాలు సైతం వచ్చే అవకాశం ఉండదు.
సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే ఎన్హెచ్ 44 తెలంగాణ సరిహద్దు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ టోల్ప్లాజా వరకు ఉంటుంది. జోగుళాంబ టోల్ప్లాజా దాటిన వెంటనే పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఏపీ అధికారులు కరోనా కట్టడి కోసం ప్రత్యేకంగా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఏపీలో మధ్యాహ్నం 12తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలంగాణ వైపు నుంచి ఏపీలోకి ప్రైవేటు వాహనాలు వెళ్లేందుకు అక్కడి అధికారులు అంగీకరిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అత్యవసర వాహనాలు సరుకు రవాణా చేసే వాహనాలను మినహా మిగతా వాటిని అనుమతించడం లేదు. తెలంగాణ నుంచి కర్నూలు వైపు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులను అలంపూర్ టోల్ ప్లాజా వరకే నడుపుతున్నారు. టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులను దింపి బస్సులు తిరిగి వస్తున్నాయి. పాక్షిక లాక్డౌన్ వల్ల బస్సులు నిలిచిపోవడంతో కర్నూలు రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. సొంత వాహనాలు ఉన్నవాళ్లు మాత్రమే లాక్డౌన్ సడలింపు వేళల్లో కర్నూలు వెళ్తున్నారు.
మన వద్దే కేసులు తక్కువ..
ఏపీ, కర్ణాటకతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ తరుణంలో ఉమ్మడి జిల్లా ప్రజలు పక్క రాష్ర్టాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసరమైతే తప్ప ఏపీ, కర్ణాటకకు ప్రయాణించకపోవడం మేలు. అక్కడ పెరిగిపోతున్న కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకే లాక్డౌన్ విధించారు. పాలమూరు ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కర్నూలు, రాయిచూరు, యాద్గిర్, గుల్బర్గా తదితర ప్రాంతాలకు ప్రయాణాలు పూర్తిగా తగ్గించడం మేలు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని సైదాపూర్ నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ మాగనూరు ప్రాంతాలకు వచ్చే రోడ్డును బైరంపల్లి వద్ద స్థానికులు కంచె వేసి మూసేశారు. కర్ణాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయని అందుకే సరిహద్దులు మూసివేయాల్సి వచ్చిందని బైరంపల్లి ప్రజలు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ నుంచి కర్ణాటక లోకి ప్రయాణికుల వాహనాలు రాకుండా స్థానిక అధికారులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కేసులు ఎక్కువగా ఉన్నందున అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొందరు నారాయణపేట, మక్తల్ పట్టణాలకు వస్తున్నారని.. వారిని కట్టడి చేసి తెలంగాణలో కేసులు పెరుగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అయితే తమకు అధికారికంగా ఆదేశాలు వచ్చేవరకు చెక్పోస్టులు ఏర్పాటు చేయడం వీలుకాదని నారాయణపేట ఎస్పీ చేతన తెలిపారు. ఏపీ, కర్ణాటకతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో కొత్త కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే వారిని కట్టడి చేస్తే కేసుల నియంత్రణకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.