ఊట్కూర్, మే 7 : కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న క్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు శుక్రవారం ఇంటింటి సర్వేను ప్రారంభించారు. మండలంలోని మల్లేపల్లి గ్రామాన్ని ప్రత్యేకాధికారి గోవిందరాజులు, ఎంపీడీవో కాళప్ప పరిశీలించారు. సర్వే ద్వారా సేకరించిన ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో మానిటరింగ్ టీమ్ ఇంటింటికీ తిరిగి జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హోం ఐసోలేషన్ కిట్లను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు జాన్, గోవర్ధన్, సుజాత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే
కృష్ణ, మే 7 : కరోనా రెండో ఉధృతి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత వల్ల కొందరు లక్షణాలు ఉన్నా దవాఖానకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. వైరస్తో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు ప్రాణాల మీదకు రావడంతోపాటు కొవిడ్ ఉధృతి పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే కోసం బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీవో విజయలక్ష్మి తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయా అని వివరాలు సేకరిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన ఆరోగ్య సర్వే
నారాయణపేట రూరల్, మే 7 : మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటా ఆరోగ్య సర్వే ప్రారంభమైంది. జాజాపూర్, సింగారం, శేర్నపల్లి, అప్పక్పల్లి, కోటకొండ, కొల్లంపల్లితోపాటు పలు గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటిటికీ తిరిగి ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే టీకాలు ఎవరెవరు తీసుకున్నారు.. ఎన్ని డోసులు తీసుకున్నారు.. ఇతర వివరాలు సేకరిస్తున్నారు.
జాజాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎం లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఉషారాణి, అనంతమ్మ, సంయుక్త, కమల, ఆశమ్మ, ఆశ వర్కర్లు సర్వేలో పాల్గొన్నారు.