నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసుశాఖల దృష్టి
ఫర్టిలైజర్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు
ప్రకటనలు చూసి మోసపోవద్దు
నకిలీగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు
రైతుల అప్రమత్తతతోనే అడ్డుకట్ట
ఆత్మకూరు, జూన్ 6: రైతు రాజు కావాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా జిల్లా అధికారులు ముందుకు సాగుతున్నారు. వానకాలం సాగులో నకిలీ విత్తనాలు, ఎరువులతో మోసపోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడుతాయనే ఆశతో రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అనుమతి లేని నకిలీ కంపెనీ విత్తనాలపై వ్యవసాయ అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా కల్తీ విత్తనాల అమ్మకాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే తనిఖీ చేస్తున్నారని, నిల్వలు ఉన్న గోదాంలపై నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు.
నిల్వలపై నిఘా ఏదీ?
కొందరు అక్రమ వ్యాపారులు ముందుగానే స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే ఏజెంట్లతో మాట్లాడుకున్న దళారులు ఆంధ్రాలోని గుంటూరు, విజయవాడ మరికొన్ని ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను జిల్లాకు తరలిస్తున్నారని వినికిడి. నకిలీ విత్తనాలు విక్రయించే ఏజెంట్లు ముందుగానే గ్రామాల్లో తిరిగి రైతుల నుంచి ఎరువులు, పురుగుమందులకు సంబంధించి బుకింగ్లు స్వీకరిస్తున్నారు. ముందుగా బుకింగ్ చేసుకోవడం వల్ల రాయితీ కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు తక్కువ రేటుకు వస్తాయన్న ఆశతో ఆయా మందులను కొనుగోలు చేసి మోసపోతున్నారు.
విత్తనాలు కొనేముందు..
వ్యవసాయ శాఖ లైసెన్సు పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలను ధృవీకరణ పత్రం (ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. బస్తా, ప్యాకెట్పై గడువు తేదీ, రకం పేరు, లాట్ నంబర్లను గమనించాలి. కొనుగోలు బిల్లుతోపాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. ప్రైవేట్ విత్తన సంస్థలు పెద్దఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయొద్దు. విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలు ఉంటే వాటినే తీసుకోవాలి.
పురుగు మందులు
చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయశాఖ సూచించే మందులను మాత్రమే కొనాలి. లైసెన్సు లేని దుకాణాల నుంచి కొనొద్దు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. లేబుల్ లేని మందుసీసా, ప్యాకెట్, డబ్బాలను కొనొద్దు. లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందుశాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు, జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ విషయాలు పరిశీలించాలి.
ఎరువుల్లో కల్తీ గుర్తించడం ఇలా..
చెమ్మగిల్లిన ఎరువుల్లో నాణ్యత లోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్ప బస్తాలోని ఎరువులు, గుళికలు ఒకే రంగులో ఉంటాయి. వేరే పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీ ఎరువుగా గుర్తించాలి. సాధారణంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ గుళికల రూపంలో ఉంటాయి. 5 ఎంఎల్ శుభ్రమైన నీరు(డిస్టిల్ వాటర్)లో ఒక చెంచా ఎరువును బాగా కలిపిన తర్వాత అడుగున ఏమి మిగలక స్వచ్ఛమైన ద్రావణం తయారవ్వాలి. ఈ ద్రావణం పరీక్ష యూరియా, అమ్మోనియం సల్ఫేట్, జింక్కు వర్తిస్తుంది. యూరియా కలిపిన నీరు రంగు లేకుండా చల్లగా ఉంటే కల్తీ లేనట్లు భావించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.