నేటినుంచి ఉమ్మడి జిల్లాలో రేషన్ పంపిణీ
2020దుకాణాల పరిధిలో 9,19,994కార్డుదారులకు లబ్ధి
20వరకు కొనసాగనున్న ఉచిత బియ్యం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మహబూబ్నగర్ జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుం చి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయను న్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 9,19,994 రేషన్కార్డుల పరిధిలోని లక్షలాది మందికి ఈ పథకం ద్వారా నెలకు 15కేజీల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రూపా యికి కిలో బియ్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో చాలామంది పేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో వారిని ఆదుకునేందుకు సర్కారు ముందుకొచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 2020 రేషన్ దుకాణాలుండగా.. 9,19,994 రేషన్కార్డులున్నాయి. గతంలో కార్డులో పేర్లున్న ప్రతిఒక్కరి పేరిట నెలకు 6కేజీల బియ్యం అందించే వారు. ప్రస్తుతం ఆ సంఖ్య 15కేజీలకు పెంచారు. 15కేజీల బియ్యం సైతం ఉచితంగానే అందించనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడనున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో నెలకు సుమారు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కార్డులోని ప్రతి వ్యక్తికి 15 కిలోలు పంపిణీ చేయడం వల్ల ఈ సంఖ్య భారీగా పెరగనున్నది. సుమారు 50వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఈ భారాన్ని భరించేందుకు సిద్ధమైనది.
ఉమ్మడి జిల్లాలో 9,19,994 కార్డులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 2020 రేషన్ దుకాణాల పరిధిలో 9,19,994 కార్డులున్నాయి. ఈ కార్డుల ద్వారా నెలకు సుమారు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 558కార్డులుండగా 2,33,928 మందికి బియ్యం పంపిణీ అవుతున్నది. నారాయణపేట జిల్లాలో తక్కువగా 298 రేషన్ దుకాణాలు, 1,38,080 కార్డులున్నాయి. ప్రస్తుతం కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 15కిలోల ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల దాదాపు 50వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి వస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే అన్ని రేషన్షాపులకు 60శాతం మేర బియ్యం తరలించారు. అందుకు తగ్గట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా రెండో దశ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత బియ్యం ఎంతో ఉపశమనం కలిగించనున్నది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే చాలామంది ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. కూలీ పనులు చేసుకునే వారికి సైతం పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుపేదలకు ప్రయోజనం కలుగనున్నది. రేషన్ దుకాణాల వద్ద కొవిడ్ నిబంధనల మేరకు. బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నేటినుంచి పంపిణీకి సిద్ధం
నేటినుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నాగర్కర్నూల్ జిల్లాలో 2,33,928 రేషన్కార్డులున్నాయి. ప్రతి నెల సాధారణంగా 4500 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేవాళ్లం. కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 15కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన తరుణంలో ఈ నెల కోటా పెరగనున్నది. జిల్లాలోని 558 రేషన్షాపులకు 11,719 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. 60శాతం బియ్యం రేషన్ దుకాణాలకు చేరుకున్నది. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ కూడా అదనంగా కలిసి వస్తుంది. రేషన్ కార్డులోని సభ్యులెవరైనా వారి ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా బియ్యం తీసుకునేందుకు అవకాశం ఉంది.
మోహన్బాబు, పౌరసరఫరాల శాఖ అధికారి, నాగర్కర్నూల్