కొవిడ్ను ఎదుర్కొనేందుకు సహకరించాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4: మహబూబ్నగర్ జిల్లాలో సమిష్టి కృషితో మొదటి విడుత కొవిడ్ను నియంత్రించగలిగామని, అదే విధంగా రెండో దశలో నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ కోరారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్పై కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు. కొవిడ్ నివారణలో భాగంగా గత సంవత్సరం జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లా దవాఖానలో 250 పడకలతో ప్రత్యేక కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం మరో 250 పడకల దవాఖానను జిల్లాకు మంజూరు చేసిందని తెలిపారు. వారం రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ఐసీయూ బెడ్లు కూడా ఎక్కువ చేయనున్నామని వెల్లడించారు. మహబూబ్నగర్ వెళితే బతుకుతామనే భరోసా ప్రజల్లో రావాలన్నారు. ఆ విధంగా ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు అధికంగా డబ్బులు వసూలు చేస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎపిడేమిక్ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానతో పాటు ఎస్వీఎస్ దవాఖానలో పడకల సంఖ్యను పెంచాలని, అవసరమైతే ఎస్వీఎస్ డెంటల్ దవాఖానను తీసుకోవాలన్నారు. దాంతోపాటు ప్రైవేటు ఫంక్షన్హాళ్లు, కమ్యూనిటీ భవనాలను ముందుగానే గుర్తించి అవసరమైన బెడ్లు, ఆక్సిజన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీఎస్, మల్లిక, నవోదయ, నేహా సన్షైన్ ఇతర దవాఖానల్లో వైద్య సేవలు, బెడ్లు, ఆక్సిజన్ గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ సోకిన, చనిపోయిన వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు. ఆక్సిజన్, రెమ్డెసివిర్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం వివిధ పనులపై సమీక్షించారు. అప్పన్నపల్లి రెండో ఫ్లైఓవర్ బిడ్జిని 5 నెలల్లో పూర్తి చేసేందుకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కృష్ణ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ హాజరయ్యారు.