గద్వాల జిల్లాలో 30,256 మందికి పరీక్షలు, 51,327మంది నుంచి శాంపిల్స్ సేకరణ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 11: డబ్బు ఏండ్ల పాలనలో ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే ప్రజలు భయపడే వారు. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారిని చూశాం. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. అత్యాధునిక పరికరాలు, వసతులతోపాటు వైద్యసేవలు, వైద్యులను, వైద్యసిబ్బందిని పెంచి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పించింది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటు చేసి రూ. కోట్లు విలువైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఖరీదైన రక్త పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్ సేవలు అందించేలా ప్రభుత్వం ప్రజలకు సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ ల్యాబ్లలో రక్తపరీక్షల కోసం, ప్రైవేట్ దవాఖానల్లో పరీక్షల పేరిట వేలల్లో బిల్లులు చూసి సొమ్మసిల్లే పరిస్థితుల నుంచి విముక్తి లభించనున్నది. పేదలకు వైద్యం, ఖరీదైన పరీక్షలు భారం కావొద్దనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు.
రెండు గంటల్లోనే నిర్ధారణ
తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో 57రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో సెంటర్లో నిత్యం 250మందికి ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆవరణలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో రెండు గంటల్లో రక్తపరీక్షల రిపోర్టు ఆన్లైన్లో రోగులకు అందిస్తున్నారు. థైరాయిడ్, హెమటాలజీ, బయాకెమిస్ట్రీ అనలైజర్, మూత్ర పరీక్షలు, మైక్రో బయోలాజికల్, లివర్ ఫంక్షనింగ్, డెంగ్యూ, చికెన్ గున్యా, లిపిడ్ ప్రొఫెల్ (గుండె సంబంధిత) కిడ్నీ, కంప్లీట్ బ్లడ్ ఫిక్చర్(సీబీపీ) బ్యాక్టీరియా అన్ని రకాలకు సంబందించిన పరీక్షలు చేస్తారు. ప్రైవేట్ ల్కాబ్లో ఒక వ్యక్తికి 57రకాల పరీక్షలు నిర్వహించాల్సి వస్తే రూ.10వేల వరకు ఫీజు వసూలు చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లలో పేదకు ఉచితంగానే ఆయా పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. శాంపిల్స్ నిల్వ చేసేందుకు అత్యాధునిక ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లో నేరుగా ఎవరికీ రక్త పరీక్షలు చేయరు. మండల పరిధిలోని ప్రభుత్వ దవాఖానల నుంచి వచ్చే శాంపిల్ను పరీక్ష చేసి ఆన్లైన్ ద్వారా రిపోర్టు పంపిస్తారు. వివిధ రకాల జబ్బులతో బాధపడే వారు వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు అవసరం ఉన్న వారు స్థానిక పీహెచ్సీ, 30 పడకల దవాఖాన, అర్బన్ పీహెచ్సీకి వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా ప్రధాన దవాఖానల్లో అందుబాటులో లేని పరీక్షలను మాత్రమే డయాగ్నొస్టిక్ సెంటర్లో చేస్తారు. క్లస్టర్ పరిధిలోని పీహెచ్సీల నుంచి రక్త నమూనాలను ఇక్కడకు ప్రత్యేక వాహనంలో తరలించి పరీక్ష చేస్తారు. రక్త పరీక్షల నిర్ధారణ అయిన వెంటనే ఆన్లైన్లో రిపోర్టు పొందపరుస్తున్నారు. ఫలితాల వివరాలు సంబంధిత పీహెచ్సీకి చేరడంతోపాటు బాధితుల సెల్ఫోన్కు సమాచారం అందిస్తున్నారు. అవసరమైతే బాధితుల సెల్ద్వారా ఫలితాల రిపోర్టు ప్రింట్ తీసుకోవచ్చు.
30,256 మందికి 51,327 శాంపిల్స్ సేకరణ
గద్వాల, జూలై 11: జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ సెంటర్లో జనవరి 9, 2021న డ్రైన్ రన్ పారంభించారు. అనంతరం రెగ్యులర్ టెస్ట్లు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 850 మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 30,256 మంది రోగుల నుంచి 51,327 శాంపిల్స్ సేకరించారు. 66,237 టెస్ట్లు చేశారు. వీరందరికీ ఉచితంగా టెస్ట్లు చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లో టైపాయిడ్, మలేరియా, బీపీ, షుగర్, థైరాయిడ్, లివర్, టీబీ, డయాలసిస్, డెంగ్యూ, డీఆర్ఎల్, ప్లేట్లేట్స్, డీ-బీ మిటమిన్, హెచ్ఐవీ, కిడ్నీ, హెమటాలజీ, బ్లడ్గ్రూపింగ్, హార్మోన్ స్టడీస్, రక్త, మూత్ర, రక్తంలో కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు చేయనున్నారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే బయట రూ.8వేల దాక ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ఉచితంగా చేస్తున్నారు. టైఫాయిడ్, మలేరియా టెస్ట్లు చేస్తే రూ.350నుంచి రూ.400వరకు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ఉచితంగా చేస్తున్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే రూ.650, షుగర్టెస్ట్ చేయించుకుంటే రూ.100, లివర్ సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, బీపీ టెస్ట్లతోపాటు మందుల కోసం ప్రతి నెల రూ.1000, టీబీ పరీక్షలతోపాటు మందుల కోసం ప్రతి నెల రూ.6వేల వరకు ఖర్చు అవుతుంది. వీటన్నింటికీ ప్రభుత్వమే ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులు అందిస్తున్నది. జిల్లాలో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు మేలు జరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.