నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 5: మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణలోని ఓ జిల్లాకు రైలులో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం దాడులు చేసి స్వాధీనం చేసుకుంది. దాడిలో తొమ్మిది క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నల్ల బెల్లం నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్నారని చెప్పారు.
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎస్సై ప్రత్యూష సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొన్నారు. నాగవల్లి ఎక్స్ప్రెస్ నిజామాబాద్ స్టేషన్కు చేరుకోగానే తనిఖీలు చేపట్టి ఓ బోగీలోని సీటు కింద నల్లబెల్లం సంచులను గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం ఉండడంతో నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.మమతకు అప్పగించారు. పట్టుబడిన నల్లబెల్లం విలువ రూ.50వేల వరకు ఉంటుందని, నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. పట్టుబడిన నల్ల బెల్లాన్ని వరంగల్కు తరలిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు.