మహబూబ్ నగర్: మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నాడు హన్వాడ మండలానికి చెందిన వెంకటేష్ అనే రైతు మహబూబ్ నగర్ మార్కెట్ యార్డుకు మొక్క జొన్న తీసుకురాగా, సాయంత్రం వరకు కొనుగోలు చేయలేదని, అంతేకాక తూకం రూపంలో మోసాలకు పాల్పడుతున్నారని, ధర కూడా తక్కువగా ఇస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
ఈ సమస్యపై తక్షణమే స్పందించిన మంత్రి ఈ విషయంపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావును ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావును విచారణ అధికారిగా ఏర్పాటు చేసి తక్షణమే రెవెన్యూ అదనపు కలెక్టర్తోపాటు, ఆర్డీవో పద్మశ్రీ, డీఎస్వో వనజాతలను మార్కెట్ యార్డ్కు పంపించారు. వీరు మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు విషయంలో వచ్చిన మోసాల ఆరోపణలపై విచారణ చేశారు.
కాగా, మంగళవారం ఉదయమే వెంకటేష్ అనే రైతు మొక్కజొన్నను మార్కెట్కు తీసుకువచ్చాడని, అంతేకాక సరిగా ఆరబెట్టక పోవటం, తేమ వంటి కారణాలవల్ల దాన్ని ఎవరూ కొనుగోలు చేయలేదని తేలింది. మొక్కజొన్న కొనుగోలు విషయంలో మధ్య దళారీలు లేదా వ్యాపారులు రైతులను మోసం చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు.