వెల్దండ, సెప్టెంబర్ 28 : పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలైన ఘటన మండలంలోని బొల్లంపల్లి పంచాయతీలోని ఈదమ్మ బండతండాలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. ఈదమ్మబండ తండాకు చెందిన నేనావత్ నాన్కు(50), నేనావత్ రుక్మిణి(25)తోపాటు వైశాలి, కళ, రూప్లా తండా సమీపంలోకి బుధవారం మధ్యాహ్నం పశువులను మేతకు తీసుకెళ్లారు. అయితే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడడంతో ఐదుగురు సమీపంలోకి చెట్టు కిందికి చేరారు.
ఈ సమయంలో పిడుగు పడడంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే వీరిని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యులు పరీక్షించగా.. నాన్కు, రుక్మిణి మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ, రూప్లా దవాఖానలో చికిత్స పొందుతుండగా.. వైశాలి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ దవాఖానకు తరలించారు. అలాగే రెండు మేకలు కూడా మృతి చెందాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాన్కుకు భర్త, ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. రుక్మిణికి భర్త, కూతురు ఉన్నది. కాగా, కల్వకుర్తి దవాఖానలో బాధితులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో రాజేశ్కుమార్, తాసిల్దార్ చంద్రశేఖర్, నాయకుడు భూపతిరెడ్డి ఉన్నారు.