అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిచ్యానాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యానాయక్, ప్రధాన కార్యదర్శి శంకర్నాయక్ కోరారు. మంగళవారం అచ్చంపేటలో గిరిజన ఏజెన్సీ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఆ ప్రాంతం ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలోనే పనిచేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 ద్వారా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ జీవోతో నష్టపోవడంతోపాటు భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాల నియామకాలకు కూడా అడ్డంకులు ఏర్పడనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం అధికరణలు 244, 244(ఎ) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనుల హక్కులు కాపాడటం కోసం ప్రత్యేక చట్టాలు, జీవోలను అమలు చేస్తున్నారని ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న చట్టాలు, జీవోలను పరిగణలోకి తీసుకొని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగులను మైదాన ప్రాంతంలోకి, మైదాన ప్రాంతంలోని ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతానికి సర్దుబాటు చేయడం వల్ల నష్టం చేకూరుతుందన్నారు. ఐడో షెడ్యూల్డ్ ప్రాంతంలో అన్నిశాఖల ఉద్యోగ నియామకాలతోపాటు పదోన్నతులు సైతం స్థానికత ఆధారంగానే నిర్వహించాలన్నారు. 1950 నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని 24 శాఖల్లో నేటికీ అనేక జీవోలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే విప్ గువ్వల బాలరాజు, మంత్రులు, కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సమావేశంలో ఏజెన్సీ ఉద్యోగులు దశరథం, అనిల్, జైపాల్, నీలహరి, తుకారం, ఝాన్సీరాం, బాబురావు, రాజు, గోపాల్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.