తిమ్మాజిపేట, జూన్ 27 : కరోనా కారణంగా రెండు ఏండ్లపాటు బడులకు దూరమైన విద్యార్థులకు ప్రాథమికాంశాలను బోధించేందుకు ప్రభుత్వ పాఠశాలలో బ్రిడ్జ్ కోర్స్ను ప్రవేశపెడుతున్నట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.ప్రాథమిక స్థాయిలో 12 వారాలపాటు, ఉన్నత స్థాయిలో 4 వారాలపాటు ప్రతి రోజూ గంటన్నర బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందన్నారు. దీనిలో ప్రాథమిక అంశాలు బోధిస్తారన్నారు. జిల్లాలో ఈఏడాది చారగోండ కేజీబీవీలో ఇంటర్ ప్రారంభిస్తున్నామని, త్వరలో మిగిలిన పాఠశాలలో ప్రారంభిస్తామన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన పాఠశాలలో పనులు ప్రారంభమయ్యాయన్నారు.ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలు మరింత పెరగాలన్నారు. అనంతరం వంటశాల, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్వో వెంకటలక్ష్మి ఉన్నారు.
పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న దుకాణాల జాబితా ఇవ్వాలి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను విక్రయించే దుకాణాదారుల పేర్లను తమ కార్యాలయంలో అందజేయాలని డీఈవో గోవిందరాజులు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల వారీగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను విక్రయించే దుకాణాదారుల పేర్లను ఈనెల 28వ తేదీ సాయంత్రం 5గంటలలోగా అందజేయాలని ఆదేశించారు. ఆతర్వాత ఇచ్చిన వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోమన్నారు.