మహబూబ్నగర్ టౌన్, మే 31: ఇటీవలే ముగిసిన పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నది. మూల్యాంకనానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని జేపీఎన్ఈఎస్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎంపిక చేశారు. జూన్ 2నుంచి 12లోపు పది మూల్యాంకనం పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న టెట్ పరీక్ష ఉన్నందున గడువు కంటే రెండు రోజుల ముందే మూల్యాంకనం పూర్తి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
3,45,146 జవాబు పత్రాలు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 3,45,146 జవాబు పత్రాలు మహబూబ్నగర్ జిల్లాకు చేరుకున్నాయి. ఉర్దూ మీడియం 6,895 జవాబు పత్రాలు, ఇంగ్లిష్, తెలుగు మీడియానికి సంబంధించినవి 3,38,251 జవాబు పత్రాలు ఉన్నాయి. మొత్తం 1,294 మంది ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను ఎంపిక చేశారు. చీఫ్ ఎగ్జామినర్లుగా 144 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 862, స్పెషల్ అసిస్టెంట్లుగా 288 మందిని ఎంపిక చేసి, వారికి ఉత్తర్వులు అందజేశారు. మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో ఉషారాణి తెలిపారు. 5జిల్లాల నుంచి సీనియర్ సబ్జెక్టు ఉపాధ్యాయులను మూల్యాంకనం చేసేందుకు ఎంపిక చేసనట్లు పేర్కొన్నారు.