కేంద్రం ధాన్యం కొనకున్నా..యాసంగి వడ్లు కొంటూ..రైతుబంధు, బీమా,సబ్సిడీ విత్తనాలు, ఎరువులు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గొర్రెల కాపరుల సర్వసభ్య సమావేశానికి హాజరై, రాజపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను అందజేశారు.
వనపర్తి/వనపర్తి రూరల్, ఏప్రిల్ 28: అన్ని రకాలు గా రైతులకు అండగా నిలుస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గొర్రెల కాపరుల స ర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వనపర్తి మండలంలోని రాజపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 5 దళితబంధు యూనిట్లను అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతితోపా టు అనుబంధ వర్గాలు కూడా అభివృద్ధి చెందేలా ప్ర భుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. త్వరలోనే జిల్లాలో జీవాల పునరుత్పత్తి కేంద్రాన్ని సీఎం అనుమతితో ప్రారంభించుకుందామన్నారు. యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేసేందుకు సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టని చర్యలను చేపట్టిందన్నారు. అసమానతలు లేని సమసమాజం నిర్మించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఆ దిశగా ముందుకు సాగుతున్నారన్నారు.
అణచివేతకు గురైన దళితులకు ఆసరా కల్పించడానికే దళితబంధు పథకమన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని, ఏ పాలకుడికి ఈ ఆలోచన తట్టలేదని మంత్రి వివరించారు. అనుభవం ఉన్న రంగానికి సంబంధించిన యూనిట్లనే ఎంచుకోవాలని, యూనిట్ల ఎంపికకు అధికారుల సహకారం తీసుకోవాలని, దళితబంధును సద్వినియోగం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు సైంటిస్టులు బస్వారెడ్డి, జాతీయ మాంసకృతుల రీసెర్చ్ సెంటర్ డాక్టర్ బర్బొద్దేలు మాంసాకృతుల, జీవాల పెంపుపై అవగాహన కల్పించారు. సర్వసభ్య సమావేశంలో ఎస్ఆర్డీపీ పథకం, గొర్రెల, మేకల షెడ్స్ కమ్యూనిటీ గొర్రెల షెడ్స్ పథకం, ఫిష్ మార్కెట్కు శాశ్వతంగా భూమి కేటాయింపు, వ్యవసాయ భూమి లేని గొర్రెల కాపరులకు రైతుబీమా మాదిరిగా ఇన్సురెన్స్ కల్పించడంపై చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, జేసీ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, సహకార సంఘం చైర్మన్ విజయ్కుమార్, వైస్ చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్య, జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వరెడ్డి, సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.