జడ్చర్లటౌన్, ఏప్రిల్ 12 : మన పల్లెలకు జాతీయ స్థాయి ఖ్యాతి లభించింది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తింపును తీసుకొచ్చాయి. మూడు గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి. రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లికి దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్, వనపర్తి జిల్లా చందాపూర్కు చైల్డ్ ఫ్రెండ్లీ, మక్తల్ మండలం మంథన్గోడ్కు నానాజీ దేశ్ముఖ్ గౌరవ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వృత్తి నైపుణ్యంలో మహిళా సంఘాల ప్రతిభ, ఆర్థిక స్వావలంబనలో ముందడుగు.. చైల్డ్ ఫ్రెండ్లీతో చిన్నారుల చదువుతోపాటు ఆరోగ్యం, భవిష్యత్కు బంగారు బాటలు.. పల్లెప్రగతి స్ఫూర్తితో గ్రామాల్లో పచ్చదనం పర్చుకొని
మెరిశాయి. ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. దీంతో పురస్కారాలకు ఎంపిక కాగా ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చని మొక్కలు.. అంతర్గత రహదారులకు ఇరువైపులా పచ్చదనం.. వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత.. పల్లెప్రకృతి వనాలు, నర్సరీల పెంపకం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, కోతుల పండ్ల వనం వంటి వాటితో గ్రామ ముఖచిత్రం మారిపోయింది. గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండడంతో రాజాపూర్ మండలం గుం డ్లపొట్లపల్లి గ్రామానికి జాతీయస్థాయిలో ఖ్యాతి లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అందజేస్తున్న దీన్దయాళ్ ఉపాధ్యాయ పం చాయతీ స్వశక్తి కరణ్ పురస్కారానికి గ్రామం ఎంపికైంది. ఈనెల 24న ఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ అ వార్డును అందుకోనున్నారు.
గుండ్లపొట్లపల్లి గ్రామంలో 248 ఇండ్లు ఉండగా, దాదాపు 933 మంది జనాభా ఉన్నారు. సర్పంచ్ నిర్ణయంలో స్థానికులందరూ భాగస్వాములవుతున్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించారు. స్వచ్ఛత కోసం బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించారు. గ్రామంలోని అంతర్గత రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. శ్రమదానంలో యువకులు సహకరిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పంచాయతీకి చెందిన ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ప్రతి ఇంటికీ పది చొప్పున జనపనార సంచులను పం పిణీ చేశారు. గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రంథాలయం, విద్యార్థులు ఆడుకునేందుకు పాఠశాల ఆవరణలో ఆటవస్తువుల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించారు. మిషన్భగీరథతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు.
అవార్డుల పంట..
గుండ్లపొట్లపల్లి గ్రామానికి ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. 2019లో స్వచ్ఛభారత్ అభియాన్, స్వచ్ఛదివస్ జాతీయ అవార్డు దక్కింది. పారిశుధ్య నిర్వహణ కోసం స్కూటీకి ట్రాలీ అమర్చి ఇంటింటికీ చెత్త సేకరించారు. ఇందుకుగానూ 2019లో ఇంటింటా ఇన్నోవేటర్ రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. స్వచ్ఛత విషయంలో 2021లో ఓడీఎఫ్ ప్లస్ అవార్డు దక్కింది. పల్లెప్రగతిలో భాగంగా మూడు విడుతల్లోనూ జిల్లా స్థాయి అవార్డులు దక్కాయి. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రామంగా ఎంపికైన గుండ్లపొట్లపల్లి.. ఇప్పుడు దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కార్ అవార్డుకు ఎంపిక కావడం విశేషం.
ఆనందంగా ఉన్నది..
జాతీయస్థాయిలో మా గ్రామానికి అవా ర్డు రావటం ఆనందంగా ఉన్నది. ఒకప్పుడు మా ఊరి పేరు చెబితే ఎక్కడుంది అనేవా రు.. ఇప్పుడు మా గ్రామాననికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో భాగస్వాములవుతు న్నాం. మూడేండ్లలోనే గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీసీ రోడ్లు, మిషన్భగీరథ నీటి సరఫరా, పల్లెప్రకృతివనాలు, నర్సరీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.
– శివకుమార్, గ్రామస్తుడు, గుండ్లపొట్లపల్లి
సమష్టి కృషితోనే అభివృద్ధి..
గ్రామస్తులు, అధికారుల సమష్టి కృషితోనే జాతీయస్థాయి అవార్డు లభించింది. చెత్తసేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. చెత్తతో తయారీ చేసిన సేంద్రియ ఎరువులను అమ్మితే రూ.9,500 ఆదాయం వచ్చింది. ఈ డబ్బులను పంచాయతీ ఖాతాలో జమచేశాం. గ్రంథాలయం, అంగన్వాడీ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పన, జిల్లాలోనే తొలిసారిగా కోతుల పండ్ల వనాన్ని ఏర్పాటు చేశాం. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకునేందుకు రాష్ట్రస్థాయి అధికారులు, ట్రైనీ కలెక్టర్లు సందర్శిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రామంగా ఎంపికైన గుండ్లపొట్లపల్లికి ఇప్పటికే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి.
– ఎం.రాఘవేందర్రెడ్డి, సర్పంచ్