మహబూబ్నగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అంకురార్పణ చేసి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి. రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని సాధించి ప్రజలకు పాలన చేరువచేశారు. అలాగే కల్వకుర్తి మున్సిపాలిటీకి కేఎల్ఐ కాల్వల ద్వారా మోటర్లు బిగించి తాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కింది. జిల్లాల విభజనలో నాలుగు మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపి వాటి రూపురేఖలు మారేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కడ్తాల్ వద్ద ఫార్మాసిటీకి ప్రతిపాదించడంలో కశిరెడ్డి కీలకపాత్ర పోషించారు. మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై పలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆయన చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలు కల్వకుర్తి ప్రాంత ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. బ్రిలియంట్ విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాష్ర్టాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు సీఎం కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో రెండోసారి శాసనమండలికి ఉమ్మడి పాలమూరు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై అభివృద్ధి, ప్రజాసేవతో ముందుకు సాగుతున్నారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు..
సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి సీఎం కేసీఆర్ పిలుపుతో 2014లో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం పాలమూరు అభ్యర్థిగా శాసమండలికి స్థానిక సంస్థల నుంచి సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో నాటినుంచి ఎమ్మెల్సీ కశిరెడ్డి కల్వకుర్తిని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు. పేరుకే కేఎల్ఐ పథకం కానీ, నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు అందించలేకపోయారు. అన్ని పార్టీలకు ఎన్నికల హామీగా ఉన్న ఈ సమస్యను తానే ముందుండి పరిష్కరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు సమస్యను విన్నవించి రూ.200కోట్లు మంజూరు చేయించారు. అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు సూచనలు పాటిస్తూ కల్వకుర్తికి సాగునీరు వచ్చేలా కృషిచేశారు.
వేలాది ఎకరాలకు సాగునీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేఎల్ఐ 29ప్యాకేజీ చివరి ఆయకట్టు జంగారెడ్డిపల్లి నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం నాగిళ్ళ వరకు 58కిలోమీటర్ల మేర డీ-82కాల్వ ఏర్పాటు చేస్తే వంగూరు, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లో అదనంగా 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రిని ఒప్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీ-82కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం రూ.178కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అలాగే కేఎల్ఐ సాగునీరు అందని గ్రామాలకు డిండి ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి 20వేల ఎకరాలకు సాగునీరు అందేలా పనులు జరుగుతున్నాయి. ఎర్రవల్లి వద్ద 1.6టీఎంసీలు, ఇర్వీన్ వద్ద 1.6టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ భూములు కోల్పోతున్న రైతులకు 2013జీవో ఆధారంగా ఎకరాకు రూ. 12లక్షల పరిహరం ఇచ్చారు.
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్న ఈ నియెజకవర్గాన్ని డివిజన్ కేంద్రంగా చేయాలని వచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఒప్పించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. శ్రీశైలం హైవేలో ఉన్న ఈ ప్రాంతాలను కలపడం వల్ల ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయాయి. కడ్తాల్ మండలకేంద్రానికి సమీపంలో ప్రభుత్వం ఫార్మాసిటీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి..
తలకొండపల్లి మండలం ఖానాపూర్కు చెందిన కశిరెడ్డి నారాయణరెడ్డి సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కష్టపడి ఉన్నత విద్యనభ్యసించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంజినీరింగ్ వరకు బ్రిలియంట్ పేరుతో విద్యాసంస్థలకు నెలకొల్పారు. ఈ సంస్థల ద్వారా పేదవిద్యార్థులకు చేయూతనందిస్తున్నా.. ప్రజలకు నేరుగా సేవచేయాలనే ఆలోచనతో కల్వకుర్తిలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయం తోడైతే ప్రజలకు మరింత దగ్గర కావచ్చనే భావనతో 2014లో టీఆర్ఎస్లో చేరారు. కశిరెడ్డికి ఇక్కడి జనం కాటన్దొర అని బిరుదు ఇచ్చారు.