మహబూబ్నగర్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో సైతం జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ డీజేలను ఏర్పాటు చేసి పెద్దపెద్ద సౌండ్ వచ్చేలా జనగణమనను పాడారు. జాతీయ పతాకాలతో రెపరెపలాడాయి. వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి, మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, జడ్చర్లలో లక్ష్మారెడ్డి, భూత్పూర్లో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి, ఎర్రవల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే అబ్రహం, గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వందలాది మంది సమక్షంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. నారాయణపేట జిల్లాలో కలెక్టర్ హరిచందన, వనపర్తిలో కలెక్టర్ యాస్మిన్ బాషా, జోగుళాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. మక్తల్ మండలం జక్లేర్లో జెడ్పీ చైర్ పర్సన్ వనజ, గద్వాలలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, నాగర్కర్నూల్లో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతిలో పాల్గొని జెండాకు వందనం చేసి గీతాలాపన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
మహబూబ్నగర్లో..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సామూహిక గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. వందలాదిమంది చౌరస్తా చుట్టూ గుమిగూడి జాతీయ పతాకాలను చేతబట్టి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ తేజస్నందలాల్పవార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చిందో ..పోరాట చరిత్రను విద్యార్థులు, యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఆర్డీవో అనిల్కుమార్, డీఎస్పీ మహేశ్, స్వాతంత్య్ర సమరయోధుడు వకీల్ భీమయ్య, సుదీప్రెడ్డి పాల్గొన్నారు.