అయిజ, ఆగస్టు 10 : టీబీ డ్యాంకు వరద పెరుగుతున్నది. దీంతో అధికారులు 33 గేట్లు ఎత్తారు. ఇన్ఫ్లో 1,74,019, అవుట్ఫ్లో 1,80,969 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 99.975 టీఎంసీలు నిల్వ ఉ న్నాయి. అలాగే ఆర్డీఎస్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 1,50,800, అవుట్ఫ్లో 1,50,400 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 400 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం ఆనకట్టలో 14.5 అడుగులమేర నీటిమట్టం ఉన్నది.
జూరాలకు పోటెత్తిన వరద..
అమరచింత, ఆగస్టు 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బుధవారం 38 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 2.07 లక్షల క్యూ సెక్కుల వరద వస్తుండగా.. 38 గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు. విద్యుదు త్పతికి 29,964 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీ లు ఉన్నది. కుడి కాల్వకు 578 క్యూసెక్కుల, ఎడమ కాల్వకు 640 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 2,22,556 క్యూసెక్కులుగా నమోదైంది.
శ్రీశైలంలో..
శ్రీశైలం, ఆగస్టు 10 : గంట గంటకూ శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం పెరుగుతున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 3.55 లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో బుధవారం ఉదయం డ్యాం 10 గేట్లను 12 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,20,001, సుంకేసుల నుంచి 1,56,766 (మొత్తం 3,76,767 క్యూసెక్కులు) శ్రీశైలానికి విడుదల చేయగా.. సాయంత్రం వరకు 3,55,436 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. డ్యాం గేట్ల నుంచి 3,17,460 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,027 క్యూసెక్కులు (మొత్తం 3,79,487 క్యుసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు.
నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.40 అడుగులు, సామర్థ్యం 215.807 టీఎంసీలకుగానూ 211.9572 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఏపీ పవర్ హౌస్లో 15.992 మిలియన్ యూనిట్లు, టీఎస్ పవర్హౌస్లో 17.183 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. డ్యాం గేట్లను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధిక సంఖ్యలో ఒకే చోట నిల్చొని సెల్ఫీల మోజులో ప్రాణాలు ఫణంగా పెట్టొద్దని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు.
నిండిన కోయిల్సాగర్..
దేవరకద్ర రూరల్, ఆగస్టు 10 : మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో బుధవారం డ్యాం ఒక గేటు తెరిచి 1500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. ఇన్ఫ్లో 2 వేల క్యూసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ వరద ను అంచనా వేస్తున్నారు. కుడి, ఎడుమ కాల్వల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపేట, మద్దూర్, కొడంగల్ మండలాలకు తాగునీటి అవసరాల కోసం 10 క్యూసెక్కులు తరలిస్తున్నారు.