కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసుకొని తెలంగాణ మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఏపీలోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏటేటా అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
పెంట్లవెల్లి, అక్టోబర్ 26: తెలంగాణ ప్రభుత్వం ఓవైపు మత్స్యకారుల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుండగా.. మరోవైపు సీమాంధ్ర జాలర్లు స్థానికుల బతుకు దెరువుపై గండి కొడుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ సమీపంలో పారుతున్న కృష్ణానది (శ్రీశైలం బ్యాక్ వాటర్) తెలంగాణ, రాయలసీమ దళారులు రూ.కోట్లను అక్రమంగా ఆర్జిస్తున్నారు.
కృష్ణాతీరంలో మకాం..
కృష్ణానదీతీర గ్రామాలైన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని గూడెం పెద్దమారూర్, చిన్నమారూర్, చెల్లెపాడు గ్రామాలను మొదలుకొని నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్, మంచాలకట్ట, వేంకల్, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి గ్రామాలతో పాటు, చీమలతిప్ప, కోతిగుండు గ్రామాల నది ఒడ్డున తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని తెలంగాణ మత్స్యసంపదను దోచుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. నదీతీరాలతోపాటు, చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణానదీతీర ప్రాంతాల్లో మాత్రం సీమాంధ్ర దళారులు స్థానిక మత్స్యకారుల బతుకు దెరువుకు గండి కొడుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన తుని, కొవ్వూరు, రాజమండ్రి, పూడిమర్క, గాజువాక, విజయవాడ, వైజాక్ ప్రాంతాల మత్స్యకారులతోపాటు, ఒరిస్సా, జార్ఖండ్, తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులకు తీసుకొచ్చి వారికి వసతులు కల్పించడమేకాక, ప్రోత్సహించి వారితో నిషేధిత అలివి వలల ద్వారా చేపపిల్లలను సైతం వదలకుండా వేటాడుతున్నారు. కృష్ణానది తీరప్రాంతాల ఒడ్డున గుడారాలను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
పేరుకే తనిఖీలు..
స్థానిక మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేసినా..భయపడకుండా తమ వేటను మూడు పూలు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఈవిషయంపై మత్స్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చూసి, చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దళారుల నుంచి మత్స్యశాఖ, పోలీస్ శాఖకు సంబంధించి కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు భారీగా ముడుపులు అందుతుండటమే కారణమని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. పేరుకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. పైగా తప్పని పరిస్థితిలో అలివి వలలపై రైడింగ్ చేయాల్సి వస్తే సంబంధిత దళారులకు ఫోన్ద్వారా ముందస్తు సమాచారం అందించి సీమాంధ్ర జాలర్లను, నిషేధిత వలలను రహస్య ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఏటా రూ.లక్షల్లో వేలం
కృష్ణానది తీర గ్రామాల్లో దళారులు తమ హద్దుబందులోని స్థలానికి (పట్టుకు) ఏటా వేలం నిర్వహిస్తారు. హద్దు(పట్టు)ను బట్టి రూ.3నుంచి 5లక్షల వరకు తమ స్థలాన్ని వేలం ద్వార లీజుకు ఇస్తారు. వేలం 2నెలల ముందే నిర్వహించి ఆంధ్రా జాలర్ల వద్ద అడ్వాన్స్ తీసుకుంటారు. స్థానిక దళారులతో చేతులు కలిపి సంబంధిత అధికారులతో మంతనాలు జరిపిన అనంతరం వివిధ శాఖాధికారులకు లక్షల్లో ముడుపులు ఇచ్చాక వారితో హామీ తీసుకొని నిషేధిత వలలతో తెలంగాణ మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.
అలవి వలలు వాడితే చర్యలు
కృష్ణానదీతీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. కృష్ణానదిలో చేపపిల్లను వదులుతున్నది. అలివి వలలపై మత్స్యకారులు ఫిర్యాదు చేస్తే, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులతో కలసి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం.
– లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖాధికారి, నాగర్కర్నూల్