‘పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి.. అభివృద్ధి పనులు పక్కాగా చేపట్టాలి’.. అని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. గురువారం కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో బర్డ్ ఎన్క్లోజర్ స్థలం, సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం, ఎంవీఎస్ వద్ద సభా ఏర్పాట్లను
మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు భారీగా జనసమీకరణను చేసి పాలమూరు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ 4న పాలమూరుకు వస్తున్నారని, పర్యటనను, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీరణ చేపట్టి పాలమూరు సత్తా చాటాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడుతూ 2014 ముందు ఉన్న పాలమూరు.. ప్రస్తుత జిల్లా పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి సభకు వేలాదిగా తరలివచ్చేలా సన్నద్ధం కావాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని.. ఈసారి ఊహించని దానికంటే ఎక్కువ స్థాయిలో సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషిని, నాయకులు చేస్తున్న పనిని మంత్రి కొనియాడారు. ప్రతి గ్రామం నుంచి జనాన్ని సమీకరించాలని సూచించారు.
ప్రతి వందమందికి ఒకరు ఇన్చార్జిగా వ్యవహరించి సీఎం సభకు తరలిరావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో అందాయని, ఇంటికో లబ్ధిదారుడు ఉంటాడని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పనులపై అవగాహన కల్పించాలన్నారు. పాలమూరు జిల్లాను గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ రూ.వేల కోట్లు విడుదల చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తక్కవ సమయంలోనే దివిటిపల్లి సమీపంలో ఐటీ పార్కులో అంతర్జాతీయంగా పేరొందిన ఓ కంపెనీ రాబోతున్నదని తెలిపారు. కనీసం 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తా యని మంత్రి చెప్పారు.
పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో ఊహించని అభివృద్ధి కండ్ల ముందు సాక్షాత్కరింపజేస్తామన్నారు. అడిగిన వెంటనే జిల్లాకు నిధులు కేటాయిస్తున్న సీఎంకు అందరూ వెన్నంటే ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్యాదవ్, ముడా చైర్మన్ గంజివెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.