హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థికశాఖ అధికారులు సమగ్రమైన నోట్ను రూపొందించారు. దీనిపై చర్చించనున్న క్యాబినెట్ ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయనున్నది. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించనున్నది. ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.