భోపాల్: అప్పటిదాకా కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోని సభ్యులంతా ఒకేసారి విగతజీవులయ్యారు. విద్యుత్ షాక్ తగలడంతో ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు విలవిల్లాడుతూ నిమిషాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లాలోని బిజావర్ ఏరియాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీజావర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు కుటుంబసభ్యులు ఉపక్రమించారు. అందుకోసం విద్యుత్ మోటార్ సాయంతో ట్యాంక్లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఇంతలో ఒకరికి విద్యుత్ వైర్ తగిలి షాక్ గురికాగా.. ఒకరిని ఒకరు రక్షించే ప్రయత్నంలో కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు నిమిషాల్లో కన్నుమూశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనకు సంబంధించి, మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అప్పటిదాకా ఇరుగుపొరుగుతో కలిసి మెలిసి ఉన్న కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.