న్యూఢిల్లీ : మన్సుక్ మాండవీయ.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు. కోవిడ్ మహమ్మారితో విలవిలవాడుతున్న సమయంలో.. ఆరోగ్యశాఖ పోస్టును మాండవీయ చేజిక్కించుకోవడం విశేషం. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అనూహ్య రీతిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక కీలకమైన కరోనా పోరులో మాండవీయ వ్యూహాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. థార్డ్వేవ్ను అడ్డుకోవాలంటే ఆయన చేపట్టే చర్యలే ముఖ్యం.
నిజానికి గత వారం రోజుల నుంచి మన్సుక్ మాండవీయ.. వ్యాక్సిన్ కంపెనీలను విజిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న మాండవీయకు ఇప్పుడు ఆరోగ్యశాఖ బాధ్యతలు దక్కాయి. వ్యాక్సిన్ తయారీదారులైన సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ కంపెనీలను ఆయన ఇటీవల విజిట్ చేశారు.
మాండవీయది గుజరాత్. ఆయన వయసు 49 ఏళ్లు. ఓసారి పార్లమెంట్కు సైకిల్పై వచ్చిన ఆయన అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కూడా. క్యాబినెట్ విస్తరణలో ఆరోగ్యశాఖను దక్కించుకున్న మాండవీయ.. కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖను కూడా నిలుపుకున్నారు. గుజరాత్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో మాండవీయ .. వెటర్నరీ సైన్స్ చదివారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ సైన్సులో మాస్టర్స్ పూర్తి చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో సభ్యుడిగా ఉన్న ఆయన 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2012లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2016లో మోదీ ప్రభుత్వంలో మాండవీయ చేరారు. రోడ్డు, రవాణా, రహదారుల శాఖలకు ఆయన సహాయ మంత్రిగా కూడా చేశారు. మోదీ, షాల తనను నమ్మారని, వారి ఆహ్వానం మేరకు తాను ప్రభుత్వంలో చేరినట్లు మాండవీయ తెలిపారు.