మేడ్చల్, జూన్28(నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా, మధ్యతరగతి రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం 2021-22 సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలిసి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ. 14, 411 కోట్ల రుణప్రణాళికను అదనపు కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గత సంవత్సరం రూ. 13,177 కోట్లతో జిల్లా ప్రణాళిక రూపొందించగా.. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా పెంచామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రుణప్రణాళికలో వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.1221.33 కోట్లు, సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా(మైక్రో, స్మాల్ మీడియం) రంగాలకు రూ.3859 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.6350.63 కోట్లతో ప్రణాళికను రూపొందించామన్నారు.
బ్యాంక్లకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందజేయాలని కోరారు. రుణాలు అందించే విషయంలో బ్యాంకర్లు సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్వాంసన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను బ్యాంకులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో చెల్లించామని పేర్కొన్నారు. బ్యాంకులకు క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే వారికి తిరిగి రుణాలను మంజూరు చేయాలన్నారు.
వివిధ బ్యాంకుల్లో లబ్ధిదారులు తీసుకున్న రుణాల చెల్లింపులపై నిబంధనల ప్రకారం వారి నుంచి రికవరీ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అనంతరం 2021-22 సంవత్సరానికి సంబంధించిన రుణప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్కుమార్, కెనరా బ్యాంక్ డీజీఎం అరుణ్ప్రసాద్, టీజీబీ రీజినల్ మేనేజర్ లక్ష్మయ్య, యూనియన్ బ్యాంక్ ఏజీఎం చంద్రశేఖర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సర్గెటరావు, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా వ్యవసాయాధికారిణి మేరి రేఖ, వివిధ బ్యాంక్ల మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.