వరంగల్ జిల్లాలోని కొండిపర్తి గ్రామం శివాలయం దగ్గర ఒక శిలాస్తంభం మీద నాలుగు పక్కల 192 పంక్తుల్లో ఉన్న సంస్కృత శాసనం దొరికింది. అది మల్యాల వంశీయులకు చెందినది. ఈ శాసనం వేయించినవాడు మల్యాల కాటసేనాని. ఇతడు ఆచమ, సబ్బసేనానుల పుత్రుడు. శాసనంలో మల్యాల వంశీయులు దుర్జయకుల సంభవులుగా పేర్కొనబడ్డారు. శాసనకాలం శ.సం. 1162 = క్రీ.శ 1240, శార్వరి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి.
కొండిపర్తిలో కాటసేనాని రెండు దేవాలయాలను నిర్మించాడు. ఒకటి రుద్రేశ్వరాలయం, రెండవది కేశవ దేవాలయం. ఈ రెండు ఆలయాలను అందులో దేవరలను ప్రతిష్టించి, పూజాదికాలకు, దానమిచ్చే సందర్భంలో ఈ శాసనాన్ని వేయించినాడు. ఈ ఆలయాలను నిర్మించేసరికే కొండపర్తిలో ప్రోలేశ్వరాలయం ఉంది. ఆ దేవునికి కూడా కొంత భూమిని దానంగా సమర్పించబడిన విషయం శాసనం ద్వారా స్పష్టమౌతుంది.
తాను నిర్మించిన రుద్రేశ్వరాలయానికి 30 నివర్తనాల భూమిని, కేశవ దేవర, ప్రోలేశ్వర దేవాలయాలకు రెండు నివర్తనాల భూమిని, అంగరంగ భోగాలకు దానంగా సమర్పించినాడు. ఈ భూములు బెల్లమ చెరువు కింద, వర్షాధారంగా పండే భూములుగా చెప్పబడినవి.
కాట చమూపతి శాసనంలో ‘ప్రతాపాక్రాంత దిక్చక్ర (హరి)దశ్వ ఇవాపరహ॥ సకోట గెల్పాత ఇతి ప్రసిద్ధోనిధి… తమేవ మాహుః పెడముట్టు గండ ముద్దండ యుద్ధాంగణ పండితిమ్నా పరిస్ఫురంతి సమరాంగణేషు…’ అని వర్ణింపబడినాడు. కాట చమూపతి భార్య కాచాంబిక. ఈమె గురించి శాసనంలో..
కాచాంబికా రాజతి తస్య పత్నీ
పతివ్రతా శీల గుణాభిరామా
తత్పాద ముద్రద్వహనాది వోర్వీ
జాతా స్వయం సంప్రతి రత్నగర్భా॥
పతివ్రత, శీల గుణాలు కలిగిన కాచాంబిక పాదముద్రలు తనపై ఉండడం వల్ల భూమి రత్నగర్భగా మారిందట. ఆమె పాద తాడనం భూమికి సహాయపడిందని భావం.
కొండిపర్తిలో కాటసేనాని నిర్మించిన రెండు ఆలయాలతో పాటు ప్రోలేశ్వరాలయం.. ఈ మూడు త్రికూటాలయాలుగా భాసిస్తున్నాయట. కైలాస మేరు మంధర సమానంగా, వాటి శిఖరాలు ఆకాశంలో బంగారు కలశాలుగా కనిపిస్తున్నాయట.
ఆలయ ప్రాకారాలు కూడా నల్ల సరపురాళ్ళను నున్నగా జేసి అంచులు కలిగిన శిలలతో సంధిబంధములు కనిపించకుండా, గోడలను నిర్మించి ఆలయాలను నిర్మించినారు. శిలల మధ్య అతుకులు కనబడకుండా ఒకే పెద్ద శిలను ఆలయంగా, ప్రాకారంగా నిర్మించడం ఆనాటి తక్షకుల గొప్పతనంగా చెప్పుకోవచ్చని శాసనంలో పేర్కొనబడింది. కాకతీయ శిల్ప కళా ప్రావీణ్యం ఆ దేవాలయాల్లో
కనిపిస్తుంది.