కొడంగల్, జూన్ 18 : మండలంలోని టేకల్కోడ్ గ్రామపంచాయతీ పరిధిలో టేకల్కోడ్తండా, మోత్కులబండతండాలో మొత్తం 2400 జనాభా, 1260 మంది ఓటర్లు, 382 నివాస గృహాలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డు, కంపోస్టు షెడ్, గ్రామ నర్సరీ, వీధివీధిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు జరిగి గ్రామానికి కొత్తందాలు సంతరించుకున్నాయి. గ్రామంలో మూడు పాడుబడ్డ గుంతలు ప్రమాదకరంగా ఉండగా, పల్లె ప్రగతిలో ఒక గుంతను పూడ్చి, మరో రెండు గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నారు.
తండా సమీపంలో ఆహ్లాదకర ప్రకృతి వనం
గ్రామానికి దూరంగా తండాకు సమీపంలో ఎకరా స్థలంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, షో చెట్లకు సంబంధించి 300ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. పచ్చటి వాతావరణంతోపాటు చిన్నారులకు ఆటాడుకునేందుకు సౌకర్యవంతంగా ఉండేలా పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రూ.26లక్షలతో సీసీ, మురుగు కాలువలు
రూ.22లక్షలతో రైతు వేదిక, రూ.12.50లక్షలతో వైకుంఠధామం నిర్మాణం పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. రూ.2.60లక్షలతో కంపోస్టు షెడ్, రూ.50వేలతో డంపింగ్యార్డు, చెత్త సేకరణకు, మొక్కలకు నీటిని అందించేందుకు తదితర పనుల నిర్వహణకు రూ.9.50లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ప్రతి రోజూ పల్లె ప్రకృతివనం, ఎవెన్యూ ప్లాంట్స్కు ట్రాక్టర్ ద్వారా నీటిని అందించడంతోపాటు డంపింగ్ యార్డ్కు చెత్తను తరలిస్తున్నారు. పంచాయతీ పరిధిలో రూ.26లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించారు. గ్రామానికి పల్లె ప్రగతి కార్యక్రమానికిగాను ప్రతి నెల రూ.లక్షా85వేలు మంజూరవుతున్నాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డు పక్కన 500 మొక్కలు, గత సంవత్సరం 600, సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మరో 1000 మొక్కలు నాటారు. ఇంటి ఆవరణలో పెంచే మొక్కలను గ్రామస్తుల కోరిక మేరకు పంపిణీ చేశారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా గ్రామంలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాబడి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతున్నది.
నాడు ఓపెన్ బావి నీరు.. నేడు మిషన్ భగీరథ నీరు..
గ్రామంలో రెండు ఓపెన్ బావులున్నాయి. ఏ కాలంలోనైనా చేదుడు బావి నీటినే ప్రజలు తాగేవారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. దీంతో ప్రజలకు నీటి ఇబ్బందులు తొలగాయి.
నర్సరీలో 11వేల మొక్కల పెంపకం
టేకల్కోడ్ గ్రామంలో ప్రస్తుత హరితహారానికిగాను నర్సరీలో 11వేల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు పంచాయతీ సెక్రెటరీ చైతన్య తెలిపారు. జామ, మునగ, ఎర్రచందనం, కానుగ, ఈత, గుల్మొహర్ తదితర మొక్కలను పెంచినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమానికిగాను గ్రామంలో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో.. వాటికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి : గుండప్ప, సర్పంచ్, టేకల్కోడ్
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో గ్రామంలో అంతర్గతంగా రోడ్డు సౌకర్యాలు ఉండేవికావు, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ నిధుల క్రింద గ్రామంలోని ఎస్సీ కాలనీ, తండాల్లో మొత్తంగా రూ.16లక్షలతో సీసీ రోడ్లు పూర్తయ్యాయి. సీడీపీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.10లక్షలతో సీసీ రోడ్లు వేసుకున్నాం.