సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ట్విట్టర్కు సంబంధించిన కేసులను త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వివిధ రకాలుగా జరిగిన వేధింపులపై సైబర్ క్రైమ్ ఠాణాలో తొమ్మిది కేసులున్నాయి. ఆయా కేసులలో నిందితులెవరనేది నిర్ధారించేందుకు ఐపీ అడ్రస్లు కావాలంటూ గతంలో సైబర్క్రైమ్ పోలీసులు ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయా కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్కు మధ్యవర్తిత్వ హోదాను కేంద్రం తొలగించింది. ఈ క్రమంలోనే ఆయా కేసులలో తమకు సమాచారం ఇవ్వాలంటూ గ్రేవియన్స్ అధికారులకు పోలీసులు పాత కేసులను గుర్తు చేస్తూ లేఖలు రాస్తున్నారు.
మీరా చోప్రపై గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో కేసు నమోదయ్యింది. ఆ కేసులో పోస్టులు పెట్టిన వారికి సంబంధించిన ఐపీ అడ్రస్లు కోరుతూ ఇటీవల పోలీసులు లేఖ రాశారు. మొదటి సారి ఇచ్చిన నోటీసులకు సంబంధించిన సమాచారం కావాలంటూ ఇప్పుడు తాజాగా అప్పటి నోటీసులను గుర్తు చేస్తూ ట్విట్టర్కు లేఖలు రాస్తున్నామని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. మిగతా కేసుల విషయంలో కూడా లేఖలు రాస్తున్నామని, ట్విట్టర్కు తమ లేఖ ముట్టినట్లు రశీదు పంపించారని, అక్కడి నుంచి వచ్చే సమాచారం మేరకు ఆయా కేసుల దర్యాప్తు ఉంటుందన్నారు. సమాచారం త్వరగా వస్తే కేసుల దర్యాప్తు పూర్తి చేసి, చార్జీషీట్ వేస్తామని వివరించారు.