అడవుల శాతాన్ని పెంచి, హరిత తెలంగాణను నిర్మించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఆరు విడుతలు హరితహారం కార్యక్రమం దిగ్విజయం కాగా, ఏడో విడుతనూ విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించి, మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. పట్టణాల్లోనూ ప్రకృతి వనాలను నిర్మించాలని సూచించారు. నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించి విరివిగా మొక్కలు పెంచాలని పేర్కొన్నారు.
రంగారెడ్డి, జూన్ 19, (నమస్తే తెలంగాణ): ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి హరిత తెలంగాణ కోసం అడుగులు వేయాలని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అటవీశాఖను 23 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని దృఢ నిశ్చయంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇప్పటి వరకు ఆరు విడుతలుగా హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలయ్యాయన్నారు. ఈ ఏడాది 7వ విడుత హరితహారం కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలో 70 లక్షల మొక్కలను నాటడం లక్ష్యమన్నారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించి మొక్కలు నాటాలన్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలను అందించాలని, అందులో తులసి, జామ, కరివేపాకు, పూల మొక్కలు ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు, డంపింగ్యార్డులు, చెరువులు, రైతుల పొలాలు, రైతు వేదికల వద్ద మియావాకి, వేప మొక్కలను నాటాలని సూచించారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. రోడ్ల వెడల్పు పనులను దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, విరివిగా మొక్కలను పెంచాలన్నారు. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచుల వరకు, కౌన్సిలర్ల నుంచి చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. పల్లె, పట్టణం పచ్చని మొక్కలతో కళకళలాడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.