అధికారులను ఆదేశించిన వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్, జూన్ 19, (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అధికారులను ఆదేశించారు. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకకుండా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిత్యం పారిశుధ్య నిర్వహణ, మురుగు కాల్వలను శుభ్రం చేయాలన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. తాగునీటి పైప్లైన్లలో లీకేజీలు లేకుండా చూడాలన్నారు. చేతి పంపుల వద్ద నీరు నిల్వకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ఇంటిపై కప్పుపై వ్యర్థంగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వంటి వాటిలో నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామాల్లో, మున్సిపల్ పరిధిలో తప్పకుండా ఫాగింగ్ చేయించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సూపర్ వైజర్లు, పూర్తి బాధ్యత వహించి బాలింతలు, చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్లోని సీహెచ్సీలో అత్యాధునిక టెస్టింగ్ యంత్రం డీ-హబ్ ద్వారా 57 రకాల టెస్టులు చేయడం జరుగుతున్నందున పీహెచ్సీల్లో రోగులకు సంబంధించిన శాంపిల్స్ పంపితే టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని హైరిస్క్ ప్రాంతాల్లో దోమలు, వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, ముమ్మర పారిశుధ్య పనులను చేపట్టి, జిల్లాను ‘0’ మలేరియా జిల్లాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా, అరవింద్, డీపీవో రిజ్వానా, డీడబ్లూవో లలిత కుమారి, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.