కాకతీయుల కాలం నాటి చెరువు ఆధునిక హంగులు అద్దుకుంటున్నది. సుమారు 2కిలో మీటర్ల పొడవైన కట్ట ఆసాంతం ట్యాంక్ బండ్ను తలపించేలా పచ్చదనం సంతరించుకుంటున్నది. విశాలమైన బతుకమ్మ ఘాట్.. వాకర్స్ ట్రాక్, బోటింగ్ పార్క్.. వెరసి మిర్యాలగూడ శివారులోని పందిళ్లపల్లి చెరువు పట్టణానికి మణిహారంలా మారనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితంగా పునరుద్ధరణ పూర్తయిన ఈ చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దనున్నారు. రూ.6.5కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మిర్యాలగూడ నియోజకవర్గంలో పందిళ్లపల్లి చెరువు మిర్యాలగూడ, యాద్గార్పల్లి గ్రామాల పరిధిలో సుమారు 480ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఈ చెరువును మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దేందుకు ప్రభుత్వం రూ.6.58కోట్లు మంజూరు చేసింది. పూడిక తొలగించడంతో పాటు, కట్టల వెడల్పు, తూముల ఆధునీకరణ, కట్టలకు రెండు వైపులా సైడ్వాల్స్, చిన్న అలుగుపై మినీ బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్నారు.
చెరువుకట్టల బలోపేతం…
మినీ ట్యాంకుబండ్ పనుల్లో భాగంగా చెరువు కట్టను మరింతగా తీర్చిదిద్దుతున్నారు. కట్టపై కంప చెట్లను తొలగించారు. సుమారు 2కి.మీ. మేర 6మీటర్ల వెడల్పుతో విస్తరణ జరుగుతున్నది. కట్ట కోతకు గురికాకుండా రెండు వైపులా సిమెంటు కాంక్రీటుతో మూడు అడుగుల ప్యారాపిట్ వాల్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా కట్టకు ఒక వైపు పచ్చదనం పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాలమైన బతుకమ్మ ఘాట్….
మినీ ట్యాంక్బండ్ వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా విశాలమైన ఘాట్ను నిర్మించారు. సుమారు 50మీటర్ల విస్తీర్ణంలో మెట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ బతుకమ్మ ఆడే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చుట్టూ ఎల్ఈడీ లైట్లు అమర్చనున్నారు. మహిళలు స్వయంగా బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఈ ఘాట్ సౌకర్యవంతంగా నిర్మించారు. దీంతో పట్టణంలోని 48వార్డుల ప్రజలతో పాటు సమీప గ్రామీణ ప్రాంతాలకు సైతం ప్రయోజనం చేకూరనున్నది.
అలుగుపై వంతెన నిర్మాణం…
మినీ ట్యాంకుబండ్ వద్ద బతుకమ్మ ఘాట్ నుంచి పట్టణంలోని నల్లగొండ రోడ్డు వరకు సుమారు 1.5కి.మీ. 30ఫీట్ల వెడల్పుతో మట్టి రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డు పూర్తయితే వాకర్లకు ఎంతో సౌకర్యవంతంగా కానున్నది. సుమారు 2కి.మీ. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకొనే అవకాశం దక్కుతుంది. అలుగుపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం…
మినీ ట్యాంకుబండ్ పనుల్లో భాగంగా పందిళ్లపల్లి చెరువు కట్టను బలోపేతం చేశారు. కంపచెట్లు, తాటిచెట్లను తొలగించారు. దశాబ్దాల కాలం తర్వాత కట్టలు పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేశారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. చుట్టూ పది గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి సమస్య తీరనున్నది.
బోటింగ్ పార్కు వరకు రోడ్డు సౌకర్యం..
పందిళ్లపల్లి చెరువు సమీపంలోని బోటింగు పార్కు నుంచి చేపట్టిన లింకు రోడ్డు పనులు పూర్తి కావొచ్చాయి. సుమారు 30ఫీట్ల్ల వెడల్పుతో ఈరోడ్డు నిర్మిస్తున్నారు. మినీ ట్యాంకుబండ్, బోటింగు పార్కుకు రావాలనుకునే వారు నేరుగా లింకు రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. పందిళ్లపల్లి చెరువులో ఈ పాటికే ఉన్న బోటింగు పార్కు మున్ముందు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నది. టీఎస్టీడీసీ (తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా చెరువులో బోటింగ్ కొనసాగుతున్నది.
అదనపు నిధులతో మరింత అభివృద్ధికి కృషి..
పందిళ్లపల్లి చెరువును మినీ ట్యాంకుబండ్గా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.58కోట్లు మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువు చుట్టూ మరింత అభివృద్ధి చేసేందుకు అదనంగా మరో రూ.5 కోట్లు కేటాయించి సీసీ రోడ్లు, పార్కులు పచ్చదనం పెంపొందించేందుకు, మినీ ట్యాంకుబండ్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం..
పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్గా తీర్చిదిద్దడం వల్ల పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలకు సైతం ఎంతో ఆహ్లాదకర వాతావరణం అందుతుంది. ఇప్పటికే బతుకమ్మ ఘాట్ నిర్మాణం పూర్తయ్యింది. తూముల పునర్నిర్మాణం, సైడ్వాల్స్ నిర్మాణం, మినీ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. మున్ముందు ప్రజలకు ఈ మినీ ట్యాంకుబండ్ ఆహ్లాదాన్ని పంచుతుంది.