జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో దారుణం జరిగింది. తనపై అత్యాచారం కేసు పెట్టిందన్న కసితో నిందితుడు బాధితురాలిని హతమార్చాడు. ఆడవేషంలో వెళ్లి అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. సిరోహి జిల్లాలోని ఓ గ్రామంలో నేత్రమ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారి ఇంటిపక్కనే ఓ వితంతువు తన ఇద్దరు పిల్లలు, చెల్లెలితో కలిసి నివసిస్తున్నది.
ఈ క్రమంలో వితంతువుపై కన్నేసిన నేత్రమ్ 2020లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన నిందితుడు తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితురాలిని బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే బాధితురాలు కేసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న నేత్రమ్ ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు గత ఆదివారం అర్ధరాత్రి ఆడవేషంలో బాధితురాలి ఇంట్లో ప్రవేశించి కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇది గమనించిన బాధితురాలు అతనితో పెనుగులాడటంతో అతను కట్టుకున్న చీర ఊడిపోయింది. దాంతో అతడు నేత్రమ్ అని గుర్తించింది. మృతురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.