న్యూఢిల్లీ, జూన్ 12: వైద్య సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. 3డీ ప్రింటింగ్ దీనిని మరింత ముందుకు తీసుకెళ్తున్నది. 3డీ ప్రింటింగ్ ఆధారంగా పరిశోధకులు క్యూబ్ ఆకారంలోని మానవ కణజాలాన్ని ల్యాబ్లో నిర్మించారు. ఈ 3డీ ప్రింటెడ్ కణజాలం సెంటీమీటర్ మందంతో ఉన్నది. ఇది 30 రోజులు మనగలుగుతుందని పరిశోధకులు తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన వాస్క్యులర్ టిస్యూ ఛాలెంజ్లో భాగంగా నార్త్కరోలినాలోని ‘వేక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజెనెరేటివ్ మెడిసిన్ (డబ్ల్యూఎఫ్ఐఆర్ఎం)’కు చెందిన పరిశోధకులు ఈ కణజాలాన్ని తయారుచేశారు. ప్రజలతోపాటు చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్లో యాత్రలు చేపట్టే వ్యోమగాములకు ప్రయోజనం చేకూరేలా టిస్యూ(కణజాలం) ఇంజినీరింగ్ ఇన్నొవేషన్స్ను ప్రోత్సహించేందుకు నాసా ఈ చాలెంజ్ను నిర్వహించింది. వైద్య పరిశోధనలు, చికిత్సలు, అవయవాల మార్పిడి కోసం దీర్ఘకాలం మన్నే 3డీ కణజాలం అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుందని నాసా తెలిపింది. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రాథమిక దశలోనే ఉన్నదని పేర్కొన్నది. ఇది విజయవంతం అయితే రోగి సొంత కణాల నుంచే కృత్రిమ అవయవాల తయారీకి మార్గం సుగమమవుతుందని వివరించింది. తద్వారా అవయవాల కొరత తీరుతుందని, అవయవాల మార్పిడి కోసం దీర్ఘకాలం నిరీక్షించాల్సిన బాధ తప్పుతుందని తెలిపింది.