నన్ను పోలీసులతో కొట్టించింది నిజం కాదా?
నా కూతురిని హాస్టల్నుంచి వెళ్లగొట్టించింది వాస్తవం కాదా?
ఈటలకు ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం అధ్యక్షుడు సంపత్ సూటి ప్రశ్నలు
హుజూరాబాద్టౌన్, జూన్9 : ‘మూడేళ్ల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమ ఆస్తుల గురించి నిరూపిస్తామని చెబితే మమ్మల్ని పదవి అడ్డుపెట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీసులతో కొట్టించింది నిజం కా దా..? నిజమని నిరూపిస్తే హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈటల రాజేందర్, అతడి భార్య, కొడు కు, కూతురు ముక్కు నేలకు రాస్తారా? అని ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల జనసేన, ఈటల యువసేన పేరుతో హుజూరాబాద్తో సంబంధం లేని కొందరితో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని, తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని హితవుపలికారు. లేనైట్లెతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘నేను, నా అనుచరులు తప్పు చేసినైట్లెతే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తామని, లేదంటే నీవు, నీ భార్య, కొడుకు, కూతురు ముక్కు నేలకు రాస్తారా?’ అని సవాల్ విసిరారు. గడచిన ఏడేళ్ల పాలనలో మంత్రి హోదాలో ఎక్కడెక్కడ దళితులపై కేసులు పెట్టావో, ఎవరెవరిని ఇబ్బందులకు గురి చేశావో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ‘బాధితులతో మాట్లాడు, వారితో తప్పు అయిందని ఒప్పుకో’ అని హితవు పలికారు. తనను అక్రమంగా జైలుకు పంపితే తన భార్య, బిడ్డలు వచ్చి ఈటల కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకపోగా హాస్టల్లో చదువుకుంటున్న తన కూతురిని హాస్టల్ నుంచి వెళ్లగొట్టించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఈటల వేధింపులతో కేసులు అనుభవించానని, తన ఆస్తులను, రాజకీయ భవిష్యత్తును కోల్పోయానని, కుటుంబం మొత్తం క్షోభకు గురయ్యామని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల దళిత బాధిత సంఘం నాయకులను చంపుతామని ఎవరెవరితోనో ఫోన్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనికంతటికీ మాజీ మంత్రి ఈటల రాజేందరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘నేను ఎవరికీ భయపడనని, చేపలు పట్టే ముదిరాజ్ జాతి మాది, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన.. అధికార పార్టీ నేతలకు భయపడను’ అని పదేపదే చెబుతున్న ఈటల రాజేందర్కు, తాను కూడా మాదిగ జాతి నుంచి వచ్చిన బిడ్డనని, తానుకూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఎక్కువ ఆచరించే బిడ్డగా ఈటలకు, ఆయన తొత్తుల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మరోసారి తమ సంఘం వారిని బెదిరింపులకు గురి చేస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని, ఈటల కుటుంబానికి, అనుచరులను హెచ్చరించారు. తాను ఎవరి ప్రోత్సాహంతోనో ఈటలను విమర్శించడం లేదని, తనకు తానుగా నిజమైన ఈటల బాధితుడిగా ఆవేదనకు గురై మాత్రమే ఆయన నీచపు చర్యలను వివరించానని, ఇందులో అధికార పార్టీ నాయకులు లేదా మరే ఏ ఇతరుల ప్రలోభాలకు లొంగిపోయి అనడం లేదని సంపత్ స్పష్టం చేశారు.