బడంగ్పేట, జూన్8: మహేశ్వరం నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా కోట్లాది రూపాయలతో సమగ్రా భివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో రూ.38లతో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారని అన్నారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణకు రూ.9కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీర్పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
మీర్పేట బుర్జు అభివృద్ధి..
మీర్పేట పాత గ్రామంలో ఉన్న బుర్జును అభివృద్ధి చేయిస్తామని మంత్రి అన్నారు. ప్రాచీన వారసత్వ కట్టడాలను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. రూ.20లక్షలతో బుర్జును అభివృద్ధి చేస్తున్నామని ఆమె అన్నారు. రూ.19లక్షలతో వరద నీటి కాల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమన్వయంతో పనిచేసి బుర్జు పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.