కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో ఎంవీ ఎక్స్ప్రెస్ పెరల్ అనే కార్గో నౌకలో భారీ స్థాయిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు శ్రీలంక, ఇండియా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఎంవీ ఎక్స్ప్రెస్ పెరల్ నౌకలో వ్యాప్తిస్తున్న మంటల్ని ఆదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. భారీగా ఎగిసిపడిన మంటల్ని కంట్రోల్ చేసినట్లు శ్రీలంకలో ఉన్న భారతీయ హై కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. మంటలు తగ్గడంతో.. నౌక ఇప్పుడు కాస్త కనిపిస్తున్నది. మంగళవారం కొలంబో తీరం వద్ద ఉన్న పెరల్ నౌకలో పేలుడు సంభవించింది. ఆ కంటేనర్ షిప్లో సింగపూర్కు కెమికల్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. దాంట్లో 1486 కంటేనర్లు, 25 టన్నుల నైట్రిక్ యాసిడ్తో పాటు ఇతర రసాయనాలు ఉన్నాయి.
భారత్లోని హజిరా నౌకాశ్రయం నుంచి ఈ కార్గో షిప్ బయలుదేరి వెళ్లింది. ఆ షిప్లో పిలిప్పీన్స్, చైనీస్, ఇండియా, రష్యా దేశాలకు చెందిన 25 మంది సభ్యులు ఉన్నారు. షిప్లో పేలుడు జరగగానే దాంట్లో ఉన్న సిబ్బందిని తరలించినట్లు శ్రీలంక నేవీ ప్రతినిధి కెప్టెన్ ఇండికా డిసిల్వా తెలిపారు. నౌకలో ఉన్న కంటేనర్ల నుంచి ఇంధనం లీకవుతున్నది. దీంతో సమీప బీచ్ల వద్ద ఆయిల్ పేరుకుంటున్నది. తీర ప్రాంత ప్రజలు నౌక నుంచి కొట్టుకువచ్చిన వాటిని ముట్టుకోవద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.