సుల్తాన్బజార్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి అత్యవసర చికిత్స అందించేందుకు వెంటిలేటర్ బెడ్ దొరక్కపోయినా భయంలేదు. ఆక్సిజన్ మాస్క్ అమర్చి ఉపశమనం పొందవచ్చు. రెండురోజులైనా దీనితో చికిత్స పొందుతూ తర్వాత వెంటిలేటర్కు మారిపోవచ్చు. ఆక్సిజన్ లెవల్స్ 85 ఉంటే, ఈ మాస్క్తోనే చికిత్స పొంది బాగవుతారు. సాధారణ ఆక్సిజన్ మాస్క్కు కొన్ని మార్పులుచేసి ఊపిరి నిలిపేలా సరికొత్త మాస్క్ను కింగ్కోఠి జిల్లా దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ రూపొందించారు. సోమవారం ప్రయోగాత్మకంగా కొంతమంది రోగులకు అమర్చగా ఆక్సిజన్ లెవల్స్ కొద్దిసేపట్లోనే 96 కు పెరిగాయి. గుజరాత్లో తన సీనియర్ ఉపయోగిస్తున్న సీప్యాక్ ఎన్ఐవీ మాస్క్ గురించి తెలుసుకున్న డాక్టర్ జలజ సొంతంగా సీప్యాక్ ఎన్ఐవీ ఎన్ఆర్బీఎం మాస్క్ను రూపొందించారు. సాధారణంగా ఆక్సిజన్ లెవల్స్ 90 ఉన్న రోగులకు 5 లీటర్ల ఆక్సిజన్ను అందించాల్సి ఉంటుంది. డాక్టర్ జలజ రూపొందించిన మాస్క్ తో రెండు లీటర్ల ఆక్సిజన్ స్థాయిని అందిస్తే 85 ఆక్సిజన్ లెవల్ ఉన్న రోగికి కూడా 96 నుంచి 99 వరకు లెవల్స్ పెరుగుతున్నాయి.
ఈ మాస్కుకు ప్రత్యేకంగా టీ ట్యూబ్, ఓ బ్యాగును అమర్చారు. సిలిండర్ నుంచి ఆక్సిజన్ మొదట ఈ బ్యాగులో నిండిన తర్వాత నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ టీ ట్యూబ్ ద్వారా బయటికి వెళ్తుంది. దీంతో పాటే వైరస్ కణాలు కూడా బయటికి వెళ్తాయి. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వేర్వేరు మార్గాల్లో వెళ్తాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందటంతో రోగి కొలుకొనే అవకాశం ఉంటున్నది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఇది ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ, అప్పటికప్పడు వెంటిలేటర్ దొరక్కపోయినా కనీసం రెండురోజులపాటు దీనిపై చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రత్యేక మాస్కును రూపొందించిన డాక్టర్ జలజను హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి అభినందించారు. మరిన్ని నూతన ఎన్ఐవీ, ఎన్ఆర్బీఎం మాస్కులను రూపొందించాలని అవసరమైన సామాగ్రి పంపించారు.